కలహండి: ఒడిశాలోని కలహండి జిల్లాలో మంగళవారం జరిగిన ఒక ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్లోకి దిగిన ఆరుగురు వ్యక్తులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మదన్పూర్-రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరియాఖుంట గ్రామంలో చోటుచేసుకుంది.
మృత్యువుకు చిరునామాగా..
నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ను శుభ్రం చేసేందుకు, నిర్మాణ సంబంధిత పనుల కోసం మంగళవారం ఆరుగురు వ్యక్తులు లోపలికి దిగారు. అయితే ట్యాంక్ లోపల పేరుకుపోయిన విషవాయువుల కారణంగా వారందరికీ ఊపిరాడక అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం
ఈ దారుణ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారాన్ని అందజేస్తామని ప్రకటించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: డేరా బాబాకు మళ్లీ పెరోల్.. 16వ సారి బయటకు..


