సునారియా: హర్యానాలోని సునారియా జైలు నుంచి డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మరోసారి బయటకు వచ్చారు. అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న రామ్ రహీమ్కు తాజాగా 30 రోజుల పాటు పెరోల్ మంజూరైంది. 2017 నుంచి ఇప్పటి వరకు ఆయనకు పెరోల్ లభించడం ఇది 16వ సారి కావడం గమనార్హం.
కట్టుదిట్టమైన భద్రత మధ్య విడుదల
మంగళవారం ఉదయం 6:30 గంటల సమయంలో రామ్ రహీమ్ జైలు నుంచి బయటకు వచ్చారు. భారీ పోలీసు కాన్వాయ్ మధ్య ఆయన సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అంతకుముందు గత జనవరి లో కూడా ఆయన 40 రోజుల పాటు పెరోల్పై బయటకు వచ్చారు. ఆయన మరోమారు జైలు నుంచి బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.
పలుమార్లు పెరోల్
2017లో ఇద్దరు మహిళా అనుచరుల అత్యాచారం కేసులో దోషిగా తేలిన రామ్ రహీమ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే గత ఆరేళ్ల కాలంలో ఆయన పదేపదే పెరోల్ పొందడంపై పలు విమర్శలు వస్తున్నాయి. 2022 నుంచి 2026 మధ్య కాలంలో ప్రతి ఏటా పలుమార్లు ఆయన జైలు నుంచి బయటకు రావడం గమనార్హం.
జర్నలిస్ట్ హత్య కేసులో నిర్దోషిగా..
గత మార్చి నెలలో పంజాబ్-హర్యానా హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. 2002 నాటి జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో రామ్ రహీమ్ను కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేసింది. అంతకుముందు సీబీఐ కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు కొట్టివేసింది. ఒకప్పుడు ‘డేరా’లో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టినందుకు జర్నలిస్ట్ ఛత్రపతి హత్యకు గురికావడం సంచలనం కలిగించింది.
ఇది కూడా చదవండి: ఇతిహాసాల్లో ఇంధన సంక్షోభానికి పరిష్కారాలు


