విష వాయువులు పీల్చి నలుగురి మృతి | Four workers killed in Gujarat septic tank | Sakshi
Sakshi News home page

విష వాయువులు పీల్చి నలుగురి మృతి

Jun 7 2026 6:57 PM | Updated on Jun 7 2026 7:44 PM

 Four workers killed in Gujarat septic tank

సూరత్‌: గుజరాత్‌లోని సూరత్‌లో ఆదివారం సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరిచే పని చేస్తున్న నలుగురు కార్మికులు విష వాయువులు పీల్చి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో... నిర్వహణ పనుల సమయంలో భద్రతా నిబంధనలు పాటించలేదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ ఘటన అశ్విని కుమార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. నగలను శుభ్రపరిచే ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు ఈ సెప్టిక్ ట్యాంక్‌లోకి వెళ్తుంటాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ట్యాంక్‌ను ప్రతి 2 నెలలకు ఒకసారి శుభ్రం చేస్తారు.

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్-1) అలోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం శుభ్రపరిచే పనిలో భాగంగా ఒక సూపర్‌వైజర్, ముగ్గురు కార్మికులు ట్యాంక్‌లోకి దిగారు. లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే నలుగురూ కుప్పకూలిపోయారు. మూసివేసిన ఆ ప్రదేశంలో విష వాయువు ఉండటమే దీనికి కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. శ్వాస ఆడకపోవడమే వారు మృతిచెందడానికి ప్రధాన కారణమై ఉండొచ్చని, అయితే కచ్చితమైన కారణం పోస్టుమార్టం పరీక్ష తర్వాత తెలుస్తుందని తెలిపారు.

కార్మికుల వద్ద భద్రతా పరికరాలు ఎక్కడ? 
ట్యాంక్‌లోకి దిగే ముందు సూపర్‌వైజర్ అగ్నిమాపక శాఖను సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రాథమిక వివరాల ప్రకారం, పనులు నిర్వహించే సమయంలో కార్మికుల వద్ద అవసరమైన భద్రతా పరికరాలు గానీ, రక్షణ సామగ్రి గానీ లేవు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు. నలుగురు కార్మికులను ట్యాంక్ నుంచి బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు.  

నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమా? అనే అంశంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. భద్రతా విధానాలు అమలు చేశారా లేదా తెలుసుకునేందుకు సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాలను పరిశీలించనున్నట్లు పోలీసులు తెలిపారు. బాధ్యులు ఎవరో గుర్తించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement