యువకుడి అనుమానాస్పద మృతి | Suspicious Death Of Young Man | Sakshi
Sakshi News home page

యువకుడి అనుమానాస్పద మృతి

Jul 26 2018 1:22 PM | Updated on Sep 2 2018 4:19 PM

Suspicious Death Of  Young Man - Sakshi

 విలపిస్తున్న కుటుంబసభ్యులు

గోదావరిఖని(రామగుండం) : అనుమానస్పద స్థితిలో ట్రైయినీ సింగరేణి కార్మికుడు మృతి చెందాడు. ఆశావర్కర్‌ వేసిన ఇంజక్షన్‌ వల్లే అజ్మీర విజయ్‌నాయక్‌(28) మృతి చెందినట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోదావరిఖని వన్‌టౌన్‌ ఎస్సై కరీంబాబా తెలిపిన వివరాల ప్రకారం.. తండ్రి ఉద్యోగాన్ని సాధించి సింగరేణిలో శిక్షణ పొందుతున్న అజ్మీర విజయ్‌నాయక్‌ గోదావరిఖని గంగానగర్‌లోని మిలీనియం క్వార్టర్‌లో నివాసముంటున్నాడు.

ఈక్రమంలో మంచిర్యాల్‌ జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన తోట రాజేశ్వరి అనే ఆశా వర్కర్‌ విజయ్‌నాయక్‌ క్వార్టర్‌కు మంగళవారం రాత్రి వచ్చింది. అయితే నడుంనొప్పి ఉండటంతో అమె ఇంజక్షన్‌ వేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంజక్షన్‌ వేసిన కొద్దిసేపటికే వాంతులు కావడంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు.

పరిస్థితి విషమంగా మారడంతో కరీంనగర్‌ ఆసుపత్రికి రెఫర్‌చేయగా మార్గమధ్యంలో విజయ్‌నాయక్‌ మృతి చెందాడు. మృతునికి భార్య ఉంది. మృతుని తండ్రి ఆజ్మీర లచ్చయ్యనాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కరీంబాబా తెలిపారు. 

పదిహేను రోజుల్లో ఉద్యోగం.. 

శిక్షణ పూర్తి చేసుకుని మరో 15రోజుల్లో సింగరేణి ఉద్యోగంలో చేరబోతున్న ఇంటిపెద్ద దిక్కు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా రాత్రి పూట ఆశావర్కర్‌ అతని ఇంటికి ఎందుకువచ్చింది? ఇంజక్షన్‌ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో తేలాల్సి ఉంది. ప్రస్తుతం మృతుని భార్య నిండు గర్భిణి కావడంతో పుట్టింటికి వెళ్లగా మృతుడు ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు. కాగా ఇంజక్షన్‌ బాటిల్‌తో ఆసుపత్రికి వెళ్లడంతో పెయిన్‌కిల్లర్‌ ఇచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement