దీప్తిశ్రీని చంపేసిన సవతి తల్లి

Step Mother Kills Girl In Kakinada - Sakshi

సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అపహరణనకు గురైన బాలిక సూరాడ దీప్తిశ్రీ ఐసాని(7)ని ఆమె సవతి తల్లి శాంతికుమారి హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. దీప్తిశ్రీ మృతదేహాన్ని ఉప్పుటేరు కాలువ  నుంచి వెలికితీయించారు. గోనె సంచిలో మూటకట్టి పడేసిన చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నయీం అస్మీ  విలేకరులతో మాట్లాడుతూ.. శాంతికుమారి ఒంటరిగానే దీప్తిశ్రీని హత్యచేసినట్టు వెల్లడించారు.

జగన్నాథపురంలోని పాఠశాల నుంచి దీప్తిశ్రీని సంజయ్‌నగర్‌లోని తన ఇంటికి తీసుకొచ్చిన శాంతికుమారి.. బాలిక గొంతుకు తువ్వాలు బిగించి కర్కశంగా హతమార్చింది. అనంతరం ఆ మృతదేహాన్ని గోనెసంచిలో మూటకట్టుకుని చేత్తో మోసుకుంటూ వెళ్లి షేర్ ఆటో ఎక్కింది. ఇంద్రపాలెం వంతెన వద్ద ఉప్పుటేరులో ఆ మూటను పడేసింది. పట్టపగలు కావడంతో ఎవరూ అనుమానించలేదు. మొదటి భార్య కూతురైన దీప్తిశ్రీ పట్ల తన భర్త ఎక్కువ ప్రేమ చూపడం, ఆమె బాగోగుల కోసం ప్రతి నెలా 8 వేల రూపాయలు ఖర్చుచేస్తుండటంతో శాంతికుమారి ద్వేషం పెంచుకుంది. ఈ నేపథ్యంలోనే దీప్తిశ్రీని ఆమె హత్య చేసిందని ఎస్పీ తెలిపారు.

ఆధారాలు అన్ని సేకరించామని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని గుర్తించామన్నారు. ఇంద్రపాలెం వంతెనకు 15 మీటర్ల సమీపంలోనే ధర్మాడి సత్యం బృందం బాలిక మృతదేహాన్ని గుర్తించి, వెలికి తీసిందని చెప్పారు. ధర్మాడి సత్యం బృందాన్ని ఎస్పీ అభినందించారు. నిందితురాలిపై కిడ్నాప్‌, హత్యానేరాలు నమోదు చేసినట్టు తెలిపారు. (చదవండి: అసలు ఏం జరిగింది?)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top