ఉద్యోగం వచ్చిన వారం రోజులకే. | Seven days after got Job.. | Sakshi
Sakshi News home page

ఉద్యోగం వచ్చిన వారం రోజులకే..

Mar 19 2018 12:11 PM | Updated on Mar 9 2019 4:28 PM

Seven days after got Job.. - Sakshi

ప్రమాదస్థలంలో గణపతి మృతదేహం

రామభద్రపురం: ఒక్కగానొక్క కుమారుడు. ఉద్యోగం వచ్చి వారం రోజులు కూడా కాలేదు. ఇంతలోనే ఆ ఇంటి దీపం ఆరిపోయింది. ఉద్యోగం వచ్చింది.. మిమ్మల్ని బాగా చూసుకుంటానన్న కుమారుడు అర్ధంతరంగా కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని సోంపురం గ్రామ సమీపంలో ఉన్న చెరువులో ఆటో బోల్తా పడిన  సంఘటనలో ఇట్లామామిడిపల్లి గ్రామానికి చెందిన రెడ్డి గణపతి (28) దుర్మరణం చెందాడు. ఇతనికి వారం రోజుల కిందటే కొమరాడ మండలం మాదలింగి పీహెచ్‌సీలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం వచ్చింది.

ఆదివారం ఉగాది పండుగ కావడంతో తల్లిదండ్రులతో గడిపేందుకు  గణపతి స్వగ్రామానికి వచ్చాడు. ఈ సందర్భంగా స్నేహితులతో సరదాగా గడిపాడు. స్నేహితుడు ధనుకొండ రమేష్‌ ఇంట్లో భోజనం చేశాడు. అనంతరం స్నేహితుడి ఆటోలో రామభద్రపురం బయలుదేరారు. సరిగ్గా సోంపురం వద్ద గల చెరువు వద్దకు  చేరుకోగానే ప్రమాదవశాత్తూ ఆటో చెరువులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గణపతి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రెడ్డి తిరుపతి, పార్వతి  సంఘటనా స్థలానికి చేరుకుని కుమారుడు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు.

ఉద్యోగం వచ్చిన కొద్ది రోజులకే నీకు నూరేళ్లూ నిండిపోయాయా నాయనా? అంటూ వారు రోదిస్తున్న తీరు చూసి అక్కడి వారి కళ్లు చెమర్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు  ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బాడంగి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డీడీ నాయుడు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement