తొలిరాత్రే ఆమెకు నరకం చూపించాడు..

Sadist Husband tortures wife in chittoor district - Sakshi

నవ వధువుపై శాడిస్ట్‌ భర్త దాష్టికం

శోభనంరోజే పెళ్ళికూతురిపై కత్తితో దాడి

చిత్తూరు జిల్లాలో ఈ దారుణ ఘటన

సాక్షి, చిత్తూరు :  మూడు ముళ్లు వేసి... 24 గంటల గడవక ముందే ఓ శాడిస్ట్‌ భర్త చేతిలో నవ వధువు తీవ్రంగా గాయపడింది. తొలిరాత్రే... ఆ వధువు చేదు అనుభవాన్ని చవిచూసింది.  దెబ్బలకు తాళలేక నవవధువు చేసిన ఆర్తనాదాలకు భయపడిన తండ్రి...  తలుపులు తీయాలన్నాడు. దీంతో... తలుపులు తీసి భర్త పరారయ్యాడు. లైట్లు వేసిన తండ్రికి.. కూతురు తీవ్రగాయాలతో పడి వున్న విషయాన్ని చూసి షాక్‌కు  గురయ్యాడు.  భర్త వికృత చేష్టలతో ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.  చిత్తూరు జిల్లా  గంగాధర నెల్లూరు మండలం మోతరంగనపల్లిలో శుక్రవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళితే.. మోతరంగనపల్లికి చెందిన కుమారస్వామిరెడ్డి కుమారుడు రాజేష్కు, చిన్నదామరగుంటకు చెందిన మునికృష్ణారెడ్డి కుమార్తె శైలజతో శుక్రవారం పెళ్లి జరిగింది. రాజేష్... వి.కోట మండలం ఆదినపల్లెలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా.... శైలజ ఎంబీయే సెకండ్ ఇయర్ చదువుతోంది. శుక్రవారం ఉదయం జీడీ నెల్లూరు మండలం కొత్తపల్లిమిట్ట కళ్యాణమండపంలో వైభవంగా శైలజ పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి తరువాత... కాణిపాకం వెళ్లి నవదంపతులు దేవుడిని దర్శించుకున్నారు. అనంతరం పెద్దదామరగుంటలోని వధువు ఇంట శుక్రవారం మొదటిరాత్రి ఏర్పాటు చేశారు. అయితే రాజేష్‌ సంసార జీవితానికి పనికిరాడని తెలుసుకున్న శైలజ కాస్సేపటి తర్వాత బయటకు వచ్చేసింది. తల్లితండ్రులకు విషయాన్ని వివరించింది. అయినా తల్లితండ్రులు నచ్చజెప్పారు. తిరిగి గదిలోకి ఆమెను పంపారు. జీవితానికి పనికిరాననే విషయాన్ని తల్లితండ్రులకు చెప్పిందనే కోపంతో రాజేష్‌ రాక్షసంగా ప్రవర్తించాడు. నవ వధువును విచక్షణా రహితంగా కొట్టాడు. అంతేగాకుండా పంటితో విపరీతంగా కొరికి గాయపరిచాడు.

నోట్లో గుడ్డలు కుక్కి కళ్లు, ముఖం వాచేలా చిత్రహింసలకు గురిచేశాడు. భర్త దెబ్బలు తట్టుకోలేక.. శైలజ కేకలు వేయటంతో ఆమె తండ్రి కంగారుపడిపోయాడు. గది తలుపులు తీయాలంటూ చెప్పాడు. దీంతో గది తలుపులు తీసిన భర్త రాజేష్.... శైలజ తండ్రిని చూసి అక్కడి నుంచి పారిపోయాడు. మొదటిరాత్రి రోజే.. అల్లుడి శాడిజాన్ని చూసిన శైలజ తల్లిదండ్రులు గంగాధరనెల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.  కాగా పెళ్లి నిమిత్తం రూ. 20లక్షల వరకూ కట్నకానుకలు ముట్టజెప్పినట్టు తెలిసింది. తనపై జరిగిన దారుణ ఘటనను తలచుకుని శైలజ భయంతో వణికిపోతోంది. కావాలనే రాజేష్‌ తనపై దాడి ఇష్టమొచ్చినట్లు కొట్టినట్లు ఆమె కన్నీటిపర్యంతమైంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top