ఇంటి ఓనర్‌ ఇంట్లోనే చోరీ | Rental Robbery in Owner House in Hyderabad | Sakshi
Sakshi News home page

ఇంటి ఓనర్‌ ఇంట్లోనే చోరీ

Jan 4 2019 8:51 AM | Updated on Jan 4 2019 8:51 AM

Rental Robbery in Owner House in Hyderabad - Sakshi

విజయేంద్ర

బోడుప్పల్‌: అద్దెకు ఉంటూ... సదరు ఇంటి ఓనర్‌ ఇంట్లో చోరికి పాల్పడిన యువకుడిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డీఐ దేవేందర్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పీర్జాదిగూడ మున్సిపల్‌ పరిధిలోని సిరిపురి కాలనీలో ఉంటున్న నరేంద్ర మేస్త్రిగా పని చేస్తున్నాడు. వారం రోజుల క్రితం అతను ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులకొట్టి బీరువాలో ఉన్న మూడు తులాల నెక్లెస్‌ ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన అతను మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈక్రమంలో గురువారం మేడిపల్లి కమాన్‌ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన విజయేంద్ర అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. గద్వాల్‌జిల్లా, ఐజా మండలం రాజపురం గ్రామానికి చెందిన విజయేంద్ర గత కొంత కాలంగా నరేంద్ర ఇంట్లో అద్దెకు ఉంటూ కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. వారం రోజుల క్రితం అతను నరేంద్ర ఇంటికి తాళం పగులకొట్టి నెక్లెస్‌ చోరీ చేసినట్లు విచారణలో తేలింది. మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు బైక్‌లు చోరీ చేసినట్లు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి నుంచి 3 తులాల నెక్లెస్‌ , రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement