‘శ్మశానం’లో రాజకీయం! | Politics In Cemetery | Sakshi
Sakshi News home page

‘శ్మశానం’లో రాజకీయం!

Mar 30 2018 9:26 AM | Updated on Mar 30 2018 9:26 AM

Politics In Cemetery - Sakshi

కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న సర్పంచ్‌ రేణుక, గ్రామస్తులు 

వేములవాడరూరల్‌: మండలంలోని రుద్రవరం గ్రామ పునరావాస కాలనీలో శ్మశాన వాటికకు 2016లో అప్పటి అధికారులు సర్వే నంబర్‌ 65, 66, 67 లోని ఆరు ఎకరాల స్థలాన్ని పంచాయతీ అధికారులకు అందజేశారు. మూడేళ్లుగా స్థల యజమాని అప్పగించడంలేదు. తన స్థలం అనుపురం పరిధిలో ఉందని, రుద్రవరం పరిధిలో ఉన్న స్థలాన్నే తీసుకోవాలంటూ యజమాని శ్మశాన వాటికకు కేటాయించిన స్థలానికి అడ్డుపడుతున్నాడు. ఈ ఆందోళన ఎట్టకేలకు కలెక్టర్‌ వరకు చేరింది. ఈ విషయంపై రుద్రవరం సర్పంచ్‌ పిల్లి రేణుక కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ను గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు.
గతంలో తమ గ్రామానికి కేటాయించిన శ్మశాన వాటిక స్థలం తమకే దక్కాలని దానికి హద్దులు ఏర్పాటు చేసి తమకు ఇవ్వాల సర్పంచ్‌తోపాటు గ్రామ పెద్దలు కలెక్టర్‌కు విన్నవించారు. స్పందించిన కలెక్టర్‌ గతంలో ఇచ్చిన విధంగా ఆరెకరాలు ఇవ్వడం కుదరదని, నాలుగు ఎకరాలు రెండు గ్రామాల్లో కలిపి తీసుకోవాలంటూ కలెక్టర్‌ వారికి తెలిపారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో జిల్లా అధికారులు కూడా ఏమీ చేయలేక గతంలో తమకు కేటాయించిన స్థలం నుండే తగ్గిస్తున్నారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, కలెక్టర్‌ స్థలాన్ని తగ్గించడంతో తాము న్యాయ పోరాటం చేస్తామని సర్పంచ్‌ పిల్లి రేణుక తెలిపారు.
గతంలో అధికారులే తమకు అన్ని ఆధారాలతో అనుమతులతో స్థలాన్ని అప్పగించారని ప్రస్తుతం ఆ స్థలం నుంచి కొంత స్థలాన్ని తీసుకోవాలని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. తమ వద్ద ఉన్న ఆధారాలతో న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement