తమ్ముడి పెళ్లి చేసిన మూడురోజులకే.. | Police Constable Commits Suicide in Visakha Steelplant | Sakshi
Sakshi News home page

సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Feb 20 2020 1:29 PM | Updated on Feb 20 2020 1:29 PM

Police Constable Commits Suicide in Visakha Steelplant - Sakshi

విజయనగరం, ఎచ్చెర్ల క్యాంపస్‌: తమ్ముడికి పెళ్లి చేసి మూడు రోజులు గడవకముందే అన్నయ్య ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం అర్ధరాత్రి విశాఖలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎచ్చెర్ల మండలం ముద్దాడ పంచాయతీ రుప్పపేటకు చెందిన సాధు సతీష్‌ (30  విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. మూడేళ్ల క్రితం రమ్యతో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు దేవాన్షు ఉన్నాడు. తండ్రి రాములు, తల్లి రమణమ్మ, అక్క రాధ, తమ్ముడు వెంకటేష్‌ రుప్పపేటలో ఉంటున్నారు. వెంకటేష్‌కు ఈ నెల 15న వివాహం జరిగింది. సతీష్‌ వారం రోజులు సెలవు పెట్టి దగ్గరుండి వివాహం జరిపించాడు. తిరిగి ఈ నెల 16న కుటుంబంతో కలిసి విశాఖపట్నం వెళ్లాడు. మంగళవారం అర్థరాత్రి సమయంలో డ్యూటీలోనే ఐఎన్‌ఎస్‌ఏఎస్‌ రైఫిల్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎటువంటి తగాదాలు లేవని, ఎందుకు ఆత్మహత్య చేసుకోవా ల్సి వచ్చిందోనని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

షాక్‌లో భార్య..:సతీష్‌ మంగళవారం రాత్రి 9 గంటలకు భార్యతో ఫోన్‌లో మాట్లాడాడు. మళ్లీ రాత్రి ఒంటిగంటకు భార్యకు ఫోన్‌ చేశాడు. ఆ సమయంలో నిద్రపోవడంతో ఫోన్‌ తీయలేదు. ఉదయం మిస్డ్‌కాల్‌ ఉండటంతో ఫోన్‌ చేయగా భర్త ఫోన్‌ లిఫ్టు చేయలేదు. దీంతో ఆందోళనకు గురైంది. ఇంతలో పరిశ్రమ సిబ్బంది సతీష్‌ మృతి విషయం చెప్పడంతో షాక్‌కు గురైంది. సతీష్‌ మృతితో రుప్పపేటలో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement