పీఎంసీ స్కాం: తాజా బాధితురాలు డైరెక్టర్‌

 PMC Bank crisis: Director claims she is a victim too deposited Rs 10 lakh recently - Sakshi

పీఎంసీ స్కాం  గురించి తెలియదు..నేనూ బాధితురాలినే - పీఎంసీ డైరెక్టర్‌

సాక్షి, ముంబై:  బ్యాంకింగ్‌ రంగంలో ప్రకంపనలు రేపిన పంజాబ్ అండ్‌ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంకు కుంభకోణంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తాను కూడా బాధితురాలేనంటూ   స్వయంగా  పీఎంసీ డైరెక్టర్‌ డాక్టర్ పర్మీత్ సోధి తాజాగా ఆరోపించారు. ఈ స్కాం నేపథ్యంలో తనకు అరెస్ట్‌ తప్పదని ఆమె  ఆందోళపడుతున్నారు. ఈ క్రమలోనే ముందస్తు బెయిల్ కోసం సెషన్స్ కోర్టులో శుక్రవారం  పిటిషన్‌  దాఖలు చేశారు. 

పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేషన​  బ్యాంకు డైరెక్టర్లలో ఒకరైన పర్మీత్ అసలు ఈ కుంభకోణం గురించి తనకు ఎంతమాత్రం తెలియదని వాపోయారు. ముఖ్యంగా హెచ్‌డీఐఎల్‌  లోన్ల అస్సలు గురించి తెలియదనీ, అందుకే ఇటీవల తాను రూ. 10 లక్షల రూపాయలు డిపాజిట్‌ చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం కెనడాలో విహారయాత్రలో ఉన్న తాను అక్టోబర్ 28 న భారతదేశానికి తిరిగి రానున్నాననీ, వచ్చిన వెంటనే అరెస్టు చేస్తారని భయపడుతున్నానని చెప్పారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో బ్యాంకుకు చెందిన పలువురు కీలకవ్యక్తులను అరెస్ట్‌ చేసిన ముంబై పోలీసులకు చెందిన ఎకనామిక్ నేరాల విభాగం (ఇఓడబ్ల్యూ)  తనకు అరెస్ట్‌ చేస్తుందని అనుమానిస్తున్నారు. 

రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా బ్యాంకు లావాదేవీలపై ఆరు నెలలపాటు ఆంక్షలు విధించడంతో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. దీంతో కేవలం రూ. 1000 మాత్రమే విత్‌డ్రా చేసుకునేలా నిబంధన విధించింది. దీంతో వేలాదిమంది ఖాతాదారులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. బిడ్డ పెళ్లి, చదువు, ఆరోగ్య ఖర్చులు, తదితర అవసరాల కోసం బ్యాంకులో నగదును డిపాజిట్‌ చేసుకున్న కస్టమర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాదు తమ కష్టార్జితం తమ  చేతికి దక్కకుండాపోయిందన్న ఆవేదనతో ఇప్పటికే అయిదుగురు ఖాతాదారులు కన్నుమూయడం విషాదం. మరోవైపు ఆర్‌బీఐ నగదు ఉపసంహరణ పరిమితి ప్రస్తుతం  రూ. 50 వేలకు పెంచిన సంగతి తెలిసిందే.

కాగా ఈ స్కాంలోఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేసిన ఆర్థికనేరాల విభాగం 17 మందిపై లుక్-అవుట్ సర్క్యులర్లు (ఎల్‌ఓసి) జారీ చేసింది. పీఎంసీ బ్యాంక్ మాజీ ఎండీజాయ్ థామస్, మాజీ చైర్మన్ వర్యం సింగ్, డైరెక్టర్ సుర్జిత్ సింగ్ అరోరాతో పాటు హెచ్‌డిఐఎల్ ప్రమోటర్లు రాకేశ్, సారంగ్ వాధవన్లను అరెస్ట్‌ చేసింది. హెచ్‌డిఐఎల్‌కు రుణాల మంజూరు సహాయం చేసిన పీఎంసీ బ్యాంక్ డైరెక్టర్ దల్జిత్ సింగ్ బాల్ పరారీలో ఉన్నాడు. బ్యాంక్ లోన్ కమిటీలోని ముఖ్య సభ్యులలో ఒకరైన దల్జిత్ సింగ్ బాల్, సుర్జిత్ సింగ్ అరోరాతో కలిసి రుణాలను సిఫారసు చేయడంలో కీలకపాత్ర పోషించారని ముంబై ఇఓడబ్ల్యూ రిమాండ్ రిపోర్ట్ తెలిపింది.


బాధిత ఖాతాదారుల ఆందోళన

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top