పెళ్లింట విషాదం

Person Died With Kidney Failure In Srikakulam - Sakshi

సాక్షి, లావేరు(శ్రీకాకుళం) : మరికొద్ది రోజుల్లో తన పెద్ద కుమార్తెకు పెళ్లి జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంతలోనే ఆ ఇంటి యజమాని వైఎస్సార్‌సీపీ నాయకుడు పడాల వెంకన్న(43) మృతి చెందడంతో ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ సంఘటన లావేరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఈయన పెద్ద కుమార్తెకు విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కందివలస గ్రామానికి చెందిన తన బావమరిదితో ఈ నెల 25న వివాహం చేసేందుకు ముహూర్తం నిశ్చయించాడు. ఈ నేపథ్యంలో కిడ్నీ, లివర్‌ సంబంధిత వ్యాధులతో వెంకన్న బాధపడుతున్నాడు. గురువారం రాత్రి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో తన ఇంటి వద్దే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెళ్లికార్డులు పంచడంతోపాటు పెళ్లి పనుల్లో నిమగ్నమైన సమయంలో ఇంటి యజమాని మరణించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇక మాకు దిక్కెవరూ అంటూ మృతదేహంపై పడి రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. 

వైఎస్సార్‌సీపీ నాయకులు పరామర్శ 
వైఎస్సార్‌సీపీ నాయకుడు పడాల వెంకన్న మృతి చెందడంతో పార్టీ సీనియర్‌ నాయకులు మహదాసు రాంబాబు, లంకలపల్లి గోపి, లంకలపల్లి నారాయణరావు, వట్టి సత్యనారాయణ, పడాల పాపారావు, లంకలపల్లి చిన్నారావు, సగరపు విశ్వనాథం, లంకలపల్లి భాస్కరరావు, తలారి నాగయ్య, ఇనుకోటి చిన్న, పైడి దాము, ఇనపకురి చలపతి, కొండక ప్రసాద్, తదితరులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలియజేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top