బొమ్మ కొంటే...కారు గిఫ్ట్‌ | Online Shopping Cheating With Car Gift | Sakshi
Sakshi News home page

బొమ్మ కొంటే...కారు గిఫ్ట్‌

Mar 16 2018 7:32 AM | Updated on Aug 14 2018 3:26 PM

Online Shopping Cheating With Car Gift - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సిటీబ్యూరో: ‘షాపింగ్‌ఫ్లెవర్‌.కామ్‌’ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో బొమ్మలు కొనుగోలు చేస్తే కారు బహుమతిగా ఇస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న ఇద్దరు ఢిల్లీవాసులను సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. క్రైమ్స్‌ డీసీపీ జానకీ షర్మిలా కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..పాయ్‌పాల్‌ నుంచి యోగేశ్‌ అనే పేరుతో మాదాపూర్‌కు చెందిన బాధితురాలికి ఫోన్‌ చేసిన ఓ వ్యక్తి మీ బాబుకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.షాపింగ్‌ఫ్లెవర్‌.కామ్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో బొమ్మలు కొనుగోలు చేస్తే కారు బహుమతిగా వస్తుందని నమ్మించాడు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన అనంతరం మీ కుమారుడు కారు గెలుచుకున్నాడంటూ ఫోన్‌ చేసిన అతను  రూ1.5లక్షలు స్కైలర్‌ మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుమీద ఐసీఐసీఐ బ్యాంక్‌ ఖాతాలో డిపాజిట్‌ చేయించుకున్నాడు.

ఆ తర్వాత మీ కారును విడుదల చేయాలంటే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చార్జీల కోసం మీ బ్యాంక్‌ ఖాతాలో రూ.5.5 లక్షలు బ్యాలెన్స్‌ ఉంచాలని సూచించడంతో ఆ మొత్తాన్ని జమ చేసింది. ఆ తర్వాత ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లాగిన్‌ పాస్‌వర్డ్‌లు తెలుసుకున్న అతను ఆ మొత్తాన్ని ఇతర బ్యాంక్‌ ఖాతాలోకి మళ్లించాడు. చివరకు మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేశారు. నిందితుడి బ్యాంక్‌ ఖాతా ఆధారంగా సోమవారం న్యూఢిల్లీలో నిందితులను పట్టుకొని ట్రాన్సింట్‌ వారంట్‌పై గురువారం నగరానికి తీసుకొచ్చారు. స్కైలర్‌ మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లుగా చెప్పుకుంటున్న మృదుల్‌ కపూర్, సుమిత్‌ సింగ్‌ సొలంకి ఫ్లాస్‌వై4యూ, మైషాప్‌మైడీల్స్, షాపింగ్‌ఫ్లెవర్‌.కామ్‌లతో ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లు ఓపెన్‌ చేసి అమాయకులను మోసం చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.  

Advertisement
 
Advertisement
Advertisement