మోసగత్తెకు ఏడాది జైలు | Sakshi
Sakshi News home page

మోసగత్తెకు ఏడాది జైలు

Published Tue, May 8 2018 2:09 PM

One year jail for a woman who cheated - Sakshi

గోపాలపట్నం(విశాఖ పశ్చిమ) : ఓమహిళ  ఘరానా మోసానికి న్యాయస్థానం సంకెళ్లేసి జైలుకు పంపింది. ఏడాది  శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. వివరాలు. గోపాలపట్నంకు చెందిన బర్రి సరోజని ఎల్లపువానిపాలేనికి చెందిన ప్రమీలాదాస్‌ అనే గృహిణికి పరిచయమైంది. తనకు సర్వే నెంబరు 104లో ప్లాట్‌ ఉందని, దీన్ని రూ.8.18లక్షలకు అమ్ముతానని చెప్పడంతో ప్రమీలాదాస్‌ ఆ స్థలాన్ని కొనుగోలు చేసింది. సరోజని ఆ మొత్తాన్ని తీసుకొని ఆమె ఇంట్లో నెలకు నాలుగువేల  చొప్పున ఇస్తానని అద్దెకు దిగింది.

ఆ మొత్తం తీసుకున్న మూడు నెలల తర్వాత బండారం బయటపడింది. ఆమె మోసకారి అని తేలింది. ప్రమీలాదాస్‌ కొన్న  స్థలాన్ని  రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో గగ్గోలు పెట్టింది. ప్రభుత్వ స్థలాన్ని అమ్మేస్తావా ... మాడబ్బులు మాకివ్వు...ఇల్లు ఖాళీ చేయ్‌..అంటే ఇపుడు రెండూ జరగవని మోసకారి మహిళ చెప్పడంతో బాధితురాలు  2012లో గోపాలపట్నం పోలీసులను ఆశ్రయించింది.

దీంతో అప్పటి సీఐ బాలసూర్యారావు  కేసు నమోదు చేసి సరోజనిని అరెస్టు చేసి కోర్టుకు పంపారు. ఏపీపీ కె.సుధారాణి బాధితురాలి తరఫున వాదనలు వినిపించారు. సోమవారం రెండో మెట్రోపాలిటిన్‌ కోర్టు న్యాయమూర్తి సమ్మిపర్విన్‌సుల్తానాబేగం తీర్పునిచ్చారు. ఏడాది జైలు శిక్ష, రూ. 10వేల  జరిమానా విధిస్తూ ఆదేశించారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement