ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..

Nursing Student Commits End lives in East Godavari - Sakshi

నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

తూర్పుగోదావరి, కాకినాడ క్రైం: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో నర్సింగ్‌ విద్యార్థిని మనస్తాపానికి గురై మూడంతస్తుల నర్సింగ్‌ స్కూల్‌ హాస్టల్‌ మేడపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మారేడుమిల్లి మండలం సెట్లవడ గ్రామానికి చెందిన డి.శిరీష 2018లో కాకినాడ జీజీహెచ్‌ నర్సింగ్‌ స్కూల్‌లో జీఎన్‌ఎం మూడేళ్ల ట్రైనింగ్‌ కోర్సులో చేరింది. కాకినాడ జీజీహెచ్‌లో ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న (ప్రస్తుతం మానేశాడు) బాలు అనే యువకుడితో శిరీష పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. బాలు హాస్టల్‌ వెనుక భాగం నుంచి నేరుగా శిరీష ఉంటున్న గది వద్దకు రావడం మొదలుపెట్టాడు. గురువారం రాత్రి కూడా వచ్చి ఆమెతో మాట్లాడడంతో ఇద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చింది.

తాను పెళ్లి చేసుకోబోనని, ఇదే విధంగా ఉండవచ్చని బాలు యువతితో చెప్పడంతో మనస్తాపానికి గురైన శిరీష శుక్రవారం ఉదయం హాస్టల్‌ మేడపైకి వెళ్లి అక్కడి నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గుర్తించిన తోటి విద్యార్థులు జీజీహెచ్‌లోని అత్యవసర విభాగానికి తరలించారు. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయమైంది. దవడ, పక్కటెముక, కాలు విరిగిపోయిందని, పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. వన్‌టౌన్‌ పోలీసులు హాస్టల్‌కు వచ్చి శిరీషతో పాటు చదువుతున్న విద్యార్థులను విచారించి సమాచారం రాబట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని త్రీటౌన్‌ సీఐ శ్రీరామకోటేశ్వరరావు తెలిపారు. శిరీష ఆత్మహత్యాయత్నాకి పాల్పడేందుకు కారణమైన బాలు అనే ఎలక్ట్రీషియన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top