కన్నకూతురిపై అనుమానం పెంచుకుని...

Mother Kills Daughter Suspicious Sexual Affair with Father - Sakshi

సాక్షి, ముంబై : కట్టుకున్న భర్తకు, కన్నకూతురిపై సంబంధం అంటగట్టిన ఆ తల్లి.. కూతురిని రోజూ వేధించసాగింది. చివరకు విచక్షణ కోల్పోయి కూతురిని పైశాచికంగా హత్య చేసింది. నవీ ముంబైలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

వివరాల్లో వెళ్తే.. రాజస్థాన్‌కు చెందిన సివిల్‌ కాంట్రాక్టర్‌కు భార్య, నలుగురు పిల్లలు. వారిలో ఇద్దరు పిల్లలు సొంతూళ్లో నాన్నమ్మ ఇంట్లో ఉంటుండగా.. మరో ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులతో ఖర్‌ఘడ్‌(నవీ ముంబై)లో నివసిస్తున్నారు. ఈ క్రమంలో గత కొంతకాలంగా ఆ గృహిణి తన కూతురి(16)పై అనుమానం పెంచుకుంది. తండ్రితో లైంగిక సంబంధం పెట్టుకుంటుందంటూ ఆరోపిస్తూ హింసించసాగింది. 

ఈ క్రమంలో మార్చి 4న కూతురిని చున్నీతో ఉరేసి హత్య చేసింది. ఆపై కూతురు విగతజీవిగా మారిందంటూ కుటుంబ సభ్యులతో కలిసి రోదించింది. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. రాజస్థాన్‌లోని తమ స్వగ్రామానికి తీసుకెళ్లి బాలిక అంత్యక్రియలు నిర్వహించారు. 

చిక్కుముడి వీడిందిలా... 
ఇక పోస్ట్‌ మార్టం రిపోర్టులో ఆమె గొంతు నులమటంతో ఊపిరాడక చనిపోయినట్లు తేలటంతో పోలీసులు కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని స్కూల్లో విచారణ చేపట్టగా.. బాలిక స్నేహితురాలు ఒకరు పోలీసులకు ఓ విషయం వెల్లడించారు. తండ్రితో సంబంధం అంటగట్టి బాలిక తల్లి హింసించేదని.. విషయం తెలిసి కూడా ఆ తండ్రి మౌనంగా ఉండేవాడని.. చివరకు వేధింపులు తాళలేక ఈ ఫిబ్రవరిలో ఆ బాలిక ఆత్మహత్యా యత్నం కూడా చేసినట్లు స్నేహితురాలు వెల్లడించింది. దీంతో ఈ మధ్యే రాజస్థాన్‌ నుంచి సదరు మహిళ తిరిగి రాగా.. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించటంతో నిజం వెలుగు చూసింది. మహిళను అరెస్ట్‌ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top