బ్యాంకు అధికారినని నమ్మించి.. | Money Robbery Wih Bank Employee Named In East Godavari | Sakshi
Sakshi News home page

బ్యాంకు అధికారినని నమ్మించి..

Jun 29 2018 7:16 AM | Updated on Aug 29 2018 7:09 PM

Money Robbery Wih Bank Employee Named In East Godavari - Sakshi

రౌతులపూడి సెంట్రల్‌ బ్యాంకు వద్ద బాధితుడు కర్రి బాబూరావు

రౌతులపూడి: తాము బ్యాంకు అధికారినని నమ్మించి ఓ అపరిచితుడు బంగారయ్యపేట గ్రామానికి చెందిన కర్రి బాబూరావు అనే వ్యక్తి నుంచి ఈ నెల 26న రూ.59వేలు నగదు చోరీ చేసిన సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. రౌతులపూడి మండలం బంగారయ్యపేట గ్రామానికి చెందిన కర్రి బాబూరావు అనే వ్యక్తి తన సొంత అవసరాల నిమిత్తం తనవద్ద ఉన్న బంగారు వస్తువులను మూడేళ్ల క్రితం స్థానిక సెంట్రల్‌బ్యాంకులో కుదవపెట్టాడు. ఈ మేరకు ఈనెల 26న ఆ బంగారు నగలను విడిపించుకుందామని బ్యాంకుకు వచ్చాడు. బ్యాంకులో తన వద్ద ఉన్న బ్యాంకు పత్రాలను అధికారులకు అందించి తాకట్టుపెట్టిన వస్తువులకు వడ్డీ, అసలు ఎంతైందని అడగగా బ్యాంకు అధికారులు రూ.64,300వరకు అయ్యిందని తెలిపారు. దీంతో బ్యాంకు నుంచి బయటకి వచ్చిన బాబూరావు వద్దకు బ్యాంకు లోపలి నుంచి ఓ అపరిచిత వ్యక్తి వచ్చి.. అతడి వద్ద ఉన్న బ్యాంకు పత్రాలను తీసుకుని ‘‘మీరు బంగారు వస్తువులు తీసుకుని మూడేళ్లుపైబడింది. వీటి చెల్లింపుల కోసం మీ ఇంటికి వచ్చాం. ఇంత ఆలస్యమైతే ఎలా?’’ అని చెప్పి బాబూరావును బంగారయ్యపేటలో ఉన్న తన ఇంటివద్దకు తీసుకెళ్లాడు. ఇంట్లోని సొమ్ములు తెమ్మని ఆదేశించారు.

బ్యాంకు అధికారులేనని నమ్మిన బాబూరావు అని అనుకుని ఇంట్లో ఉన్న రూ.59వేలు నగదు తీసుకువచ్చి వారికి చూపాడు. మిగిలిన సొమ్ములు శుక్రవారం చెల్లిస్తే బంగారు వస్తువులు ఇస్తారని ఈ సొమ్ములు ఇప్పుడు చెల్లించాలని సొమ్ములు తీసుకుని తిరిగి రౌతులపూడిలో ఉన్న బ్యాంకుకు తిరిగి వచ్చారు. బాబూరావు వద్ద ఉన్న రూ.59వేలు తీసుకుని బాబూరావును ఆధార్, బ్యాంకు పాస్‌ పుస్తకాల జెరాక్స్‌లు తీసుకురమ్మని అపరిచిత వ్యక్తి బ్యాంకు లోపలికి వెళ్లాడు. జెరాక్స్‌లు తీసుకుని వచ్చిన బాబూరావుకు సొమ్ములు చెల్లించినట్టు బ్యాంకులోని డిపాజిట్‌ ఫారం ఒక ముక్క చించి రశీదుగా ఇచ్చాడు. దీంతో సరే అని అక్కడి నుంచి అపరిచిత వ్యక్తి, బాబూరావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరలా బాబూరావు మిగిలిన సొమ్ములను తీసుకుని బుధవారం బ్యాంకుకు రాగా సొమ్ములు చెల్లించలేదని ఎవరో అపరిచిత వ్యక్తి నిన్ను మోసం చేశారని అధికారులు వెల్లడించారు. దీంతో కంగుతిన్న బాబూరావు లబోదిబోమంటూ అన్నవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement