మూక హత్య : మరో దారుణం
సాక్షి, న్యూఢిల్లీ: మూకహత్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కొనసాగుతుండగానే దేశ రాజధాని నగరంలో మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేశాడనే అనుమానంతో ఒక మైనర్ను తీవ్రంగా కొట్టి చంపిన ఘటన ఉద్రిక్తత రేపింది. నార్త్-వెస్ట్ ఢిల్లీ, ఆదర్శ్ నగర్లో శుక్రవారం ఉదయం ఈ అమానుషం చోటు చేసుకుంది.
ఆదర్శ్ నగర్లో మైనర్ హత్య
శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మైనర్బాలుడు సాహిల్ (16) పొరుగువారి నివాసంలోకి వచ్చాడు. అదే సమయంలో నిద్రనుంచి మొల్కొన్న ఇంటి యజమాని ముఖేష్ ..అతను దొంగతనానికి వచ్చాడని భావించాడు. అతణ్ని పట్టుకొని చుట్టుపక్కల వారినందర్నీ పిలిచాడు. దీంతో అందరూ గుమిగూడి సాహిల్ను తీవ్రంగా కొట్టం ప్రారంభించారు. అయితే కొంతమంది స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు గాయపడిన సాహిల్ను జగ్జీవన్ రామ్ ఆసుపత్రిలో చేర్పించారు. కానీ తీవ్ర గాయాలతో సాహిల్ ప్రాణాలొదిలాడు. ఈ ఘటనలో ముఖేష్తోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
సాహిల్ హత్యపై అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. దొంగతనం చేసే అలవాటు తమ పిల్లవాడికి లేదనీ, ఏదో ఒక పని చేసి కుటుంబానికి ఆసరాగా వుండేవాడని నానమ్మ వాపోయింది.