వివాహిత అనుమానాస్పద మృతి

Married Women Commits Suicide in Chittoor - Sakshi

చిత్తూరు, కాణిపాకం(పూతలపట్టు) : వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన పూతలపట్టు మండలం బండపల్లెలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన యశోద (22)కు నాలుగు నెలల క్రితం వివాహమైంది. ఆమె భర్త వృత్తిరీత్యా జవాను కావడంతో వివాహమైన 50 రోజుల అనంతరం విధులకు వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో యశోద తన అత్త, ఆడపడుచుతో కలిసి ఉంటోంది. వారి మధ్య చిన్నపాటి గొడవలు తలెత్తేవని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం చెరువు వద్ద విగతజీవిగా కనిపించింది. గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం చేరవేశారు. ఎస్‌ఐ మల్లేష్‌యాదవ్‌ అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మెడ చుట్టూ నల్లటి చారిక ఉండడంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందా? అన్నది పోలీసులు స్పష్టం చేయలేదు.  ఒకవేళ ఉరి వేసుకుని ఉంటే ఎక్కడ వేసుకుంది? ఎవరు మృతదేహాన్ని దించారు? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. మృతికి కారణాలేమిటో పోస్టుమార్టం నివేదికలో వెల్లడి కావాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top