పెళ్లికి వచ్చి.. పరలోకానికి

Man Fell Down Into Vengalaraya Sagar Project In Vizag - Sakshi

మక్కువ(సాలూరు) : స్నేహితుడి పెళ్లి చూసేందుకని వచ్చి మళ్లీ తిరిగిరాని లోకాలకు చేరుకున్న ఓ వ్యక్తి విషాద గాథ ఇది. సాలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నంలోని క్రాంతినగర్‌ కాలనీకి చెందిన ముత్యాల నారాయణమూర్తి సాలూరు మండలం బాగువలసలో జరుగుతున్న స్నేహితుడి పెళ్లి కోసమని శుక్రవారం వచ్చాడు. పెళ్లి అయిపోయిన అనంతరం శనివారం అక్కడే ఉన్న వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టును చూసేందుకు మిగిలిన స్నేహితులు మురళి, అప్పలస్వామితో కలిసి వెళ్లాడు. వారితో కలిసి రెగ్యులేటర్‌లోకి స్నానానికి దిగాడు.

అయితే రెగ్యులేటర్‌ వద్ద రాళ్లపై స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ కాలుజారి ప్రాజెక్టు లోపలికి పడిపోయాడు. తోటి స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా నారాయణమూర్తి రాళ్లలో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక చనిపోయాడు. విషయం తెలుసుకున్న సాలూరు అగ్నిమాపక సిబ్బంది వెంగళరాయ సాగర్‌ ప్రాజెక్టు వద్దకు చేరుకుని సుమారు మూడు గంటలు గాలించి మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. సంఘటనా స్థలానికి సాలూరు సీఐ సయ్యద్‌ మహ్మద్, ఏఎస్‌ఐ గౌరీశంకర్‌ చేరుకుని కేసు నమోదు చేశారు. మృతునికి భార్య ఉమ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లికి వచ్చిన వ్యక్తి తమ గ్రామంలో చనిపోవడంతో బాగువలసలో విషాదం అలుముకుంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top