చచ్చినట్లు నాటకమాడి.. భార్య, అత్తమామలను.. | Man Faking Own Murder To Trap Wife And In Laws In UP | Sakshi
Sakshi News home page

చచ్చినట్లు నాటకమాడి.. భార్య, అత్తమామలను..

Jun 26 2018 7:18 PM | Updated on Oct 9 2018 5:39 PM

Man Faking Own Murder To Trap Wife And In Laws In UP - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

లక్నో : భార్య, అత్తమామలపై ప్రతీకారం తీర్చుకోవటానికి చచ్చినట్లు నాటకమాడాడో వ్యక్తి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్‌ జిల్లాకు చెందిన పన్నెలాల్‌ యాదవ్‌ను కొన్ని సంవత్సరాల క్రితం భార్య , అత్తమామలు వేధింపుల కేసుకింద జైలులో పెట్టించారు. కొద్ది రోజుల తర్వాత ఇరు కుటుంబాలు రాజీ కుదుర్చుకుని అతన్ని బయటకు రప్పించారు. అప్పటి నుంచి భార్య, అత్తమామలపై క్షక్ష్య పెంచుకున్న యాదవ్‌ ప్రతీకారంతో రగిలిపోయాడు. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న యాదవ్‌కు ఓ ఉపాయం తట్టింది. తాను చనిపోయినట్లు నాటకమాడి భార్య కుటుంబాన్ని హత్య కేసులో ఇరికించాలని అనుకున్నాడు. 2016 అక్టోబర్‌ నెలలో అత్తమామలను కలవటానికి వారి ఇంటికి వెళుతున్నానని చెప్పి అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు.

నెలలు గడుస్తున్నా యాదవ్‌ ఆచూకీ లభించకపోయే సరికి అతని కుటుంబ సభ్యులు భార్య, అత్తమామలే చంపి, శవాన్ని కనపడకుండా చేసుంటారని భావించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకోకపోవటంతో యాదవ్‌ కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీంతో పోలీసులు అతని భార్య, అత్తమామలపై హత్య, ఆధారాలను చెరిపివేశారన్న కారణాలతో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ముంబైలోని మీరా రోడ్‌లో ఓ వ్యక్తిని రెండు సంవత్సరాలుగా మారు వేశాలతో తిరుగుతున్నాడన్న అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆవ్యక్తిని విచారించగా అసలు విషయం బయటపడింది.  ఆవ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లో కనిపించకుండా పోయిన పన్నెలాల్‌ యాదవ్‌గా పోలీసులు  గుర్తించారు. భార్య కుటుంబాన్ని ఇరికించాలనే.. యాదవ్‌ తన కుటుంబం సహాయంతో నాటక మాడాడని తేలింది. భార్య కుటుంబాన్ని ఇరికించాలని చూసిన యాదవ్‌ను అతని కుటుంబాన్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement