కళ్ల ముందు హత్య: పరారైన పోలీసులు | Man Assassinated By Gang In Front Of Police In Dharavi | Sakshi
Sakshi News home page

కళ్ల ముందు హత్య: పరారైన పోలీసులు

Jun 29 2020 12:39 PM | Updated on Jun 29 2020 1:21 PM

Man Assassinated By Gang In Front Of Police In Dharavi - Sakshi

ముంబై : కళ‍్ల ఎదుటే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురవుతుంటే కాపాడాల్సిన పోలీసులు భయంతో పరుగులు పెట్టారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి ముంబై, ధారావి ఏరియాలోని డా.బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ గార్డెన్‌ సమీపంలో నివాసం ఉండే ఆఫ్జల్‌ షేక్‌ అనే వ్యక్తి స్నేహితులతో కలిసి కూర్చుని ముచ్చట్లు పెట్టాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు పోలీసులు అందరినీ ఇళ్లకు వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో అఫ్జల్‌ స్నేహితులు అక్కడినుంచి వెళ్లిపోయారు. కానీ, అతడు అక్కడే కూర్చుండిపోయాడు. అదే సమయంలో 10 మంది ఆయుధాలతో అతడ్ని చుట్టుముట్టారు. విచక్షణా రహితంగా దాడి చేశారు. అఫ్జల్‌ స్పృహతప్పిపడిపోయిన తర్వాత వారు పరారయ్యారు. (వీళ్లు మనుషులు కాదు రాక్షసులు)

తీవ్రగాయాలపాలైన అతడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్యతో సంబంధం ఉన్న ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే మృతుడి బంధువులు సంఘటనా స్థలంలో ఉన్న ఇద్దరు పోలీసుల తీరును తప్పుబడుతున్నారు. నిలువరించాల్సిన పోలీసులు భయంతో అక్కడినుంచి పారిపోయారని, వాళ్లక్కడే ఉండి ఉంటే హత్య జరిగేది కాదని అంటున్నారు. అదనపు బలగాలను పిలవాల్సిందని అన్నారు. విధులు సక్రమంగా నిర్వహించని ఇద్దరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ( అందంగా లేనని అందని లోకాలకు...)

Advertisement
 
Advertisement
Advertisement