పద్మావత్‌ థియేటర్లను తగలపెట్టిన కర్ణిసేన | karni sena protest against padmavati cinema in gurugram | Sakshi
Sakshi News home page

థియేటర్లను తగలపెట్టిన కర్ణిసేన

Jan 24 2018 6:21 AM | Updated on Sep 27 2018 2:34 PM

karni sena protest against padmavati cinema in gurugram - Sakshi

పద్మావత్‌(పద్మావతి) సినిమా విడుదల సందర్భంగా గుజరాత్‌లో హింస చెలరేగింది. వివాదాలకు చిరునామాగా నిలిచిన పద్మావత్‌ చిత్రం విడుదల సందర్భంగా గుజరాత్‌లో అల్లర్లు చెలరేగాయి. మొదటి నుంచి సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించిన కర్ణిసేన అన్నంత పని చేసింది. గుజరాత్‌, అహ్మదాబాద్‌లో సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌పై దాడులకు దిగారు. సినిమా విడుదలకు సిద్దమౌతున్న హిమాలయ, అహ్మదాబాద్‌ వన్‌ మాల్స్‌, మరో సినిమా థియేటర్‌ను కర్ణిసేన కార్యకర్తలు తగలపెట్టేశారు. పార్కింగ్‌ ప్రదేశాల్లో, రోడ్లపై ఉన్న సుమారు 150 వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.

రంగంలోకి దిగిన పోలీసులు, పరిస్థితి అదుపు తప్పడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఆందోళనకారులను చెదరకొట్టారు. దీనిపై రాష్ట్ర డీజీపీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అదనపు బలగాలను రంగంలోకి దించారు. అంతేకాకుండా సినిమా ప్రదర్శింపబడుతున్న థియేటర్లకు సెక్యూరిటీ పెంచారు. ఆందోళనలపై స్పందించిన గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ శాంతి పాటించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అల్లర్లకు సంబంధించిన వీడియోని గుజరాత్‌ పోలీసులు విడుదల చేశారు. ఈ వీడియో ఉన్న వ్యక్తులు తమను ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్‌లు ధరించి థియేటర్లపై రాళ్లతో దాడులకు పాల్పడగా మరికొంత మంది రోడ్డుపై ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు.

గుజరాత్‌లో చెలరేగిన హింస, గంటల్లోనే ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలకు వ్యాపించింది. మద్యప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌లలో కర్ణిసేన కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. కాన్పూర్‌లో ఓ షాపింగ్‌మాల్‌లోకి ప్రవేశించిన ఆందోళనకారులు, అక్కడి సిబ్బందిపై దాడలకు పాల్పడ్డారు. సినిమా ప్రదర్శించొద్దంటూ అక్కడున్న సినిమా పోస్టర్లను చించిపడేశారు. ఇండోర్‌, మొరేనా, గ్వాలియర్‌లలో ఆందోళనలు నిర్వహించారు.  ఉజ్జయనీలో ఓథియేటర్‌పై దాడికి యత్నించిన వారిని స్థానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గురుగ్రామ్‌లో అల్లర్లను అదుపు చేయాడానికి 144 సెక్షన్‌ విధించారు. పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకూ ఎవరూ గుంపులగా తిరగొద్దంటూ అహ్మదాబాద్‌ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అల్లర్లపై కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితులకోసం గాలిస్తున్నారు. వరుస ఆందోళనల నేపథ్యంలో థియేటర్‌ యజమానులు సినిమా ప్రదర్శించట్లేదంటూ బయట బోర్డులు పెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement