
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు, ఇస్లామిక్ స్టేట్, స్థానిక టెర్రరిస్ట్ సంస్థల్లో మాత్రమే ఇప్పటివరకు హైదరాబాద్ యువత పేరు వినిపించేది. తాజాగా కశ్మీర్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు. అనంతనాగ్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన ముగ్గురు అన్సార్ గజ్వతుల్ హింద్ (ఏజీహెచ్) ఉగ్రవాదుల్లో కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన మహ్మద్ తౌఫీఖ్ ఉన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీంతో ఈ తౌఫీఖ్ ఎవరో గుర్తించేందుకు రాష్ట్ర నిఘా వర్గాలు రికార్డులు తిరగేస్తున్నాయి.
2017లో కశ్మీర్కు వచ్చిన తౌఫీఖ్ ఏజీహెచ్లో కీలక స్థానంలో ఉన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. కొన్నాళ్లుగా అల్ కాయిదా కశ్మీర్లోనూ ప్రాబల్యం చాటేందుకు ప్రత్యేకంగా ఏజీహెచ్ను ఏర్పాటు చేసింది. గతంలో ఇస్లామిక్ స్టేట్లో పని చేసిన వారు ఏజీహెచ్లో చేరినట్లు కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. కాగా తౌఫిక్ సోషల్ మీడియా ద్వారా ఇస్లామిక్ ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడంతోపాటు, ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నట్లు కొత్తగూడెం ఎస్పీ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు.