అక్రమ సంబంధం; నమ్మించి తోసేశాడు

Husband Pushed Off His Wife From Eighth Floor In Gurugram - Sakshi

గురుగ్రామ్‌ : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను మేడపై నుంచి తోసి చంపేశాడు. అనంతరం ప్రమాదవశాత్తు కింద పడిందని పోలీసులతో నమ్మబలికాడు. ముమ్మర దర్యాప్తు చేసిన పోలీసులు ఆమె చావుకు కారణమైన భర్తను, అతని ప్రియురాలిని అరెస్టు చేశారు. ఈ ఘటన గురుగ్రామ్‌లోని ‘వాలీ వ్యూ ఎస్టేట్‌’ అపార్ట్‌మెంట్‌లో గత అక్టోబర్‌, 27న చోటుచేసుకుంది. వివరాలు.. దీపికా చౌహన్‌ (32), విక్రం చౌహన్‌ (35) భార్యభర్తలు. వీరికి నాలుగేళ్ల పాప, 5 నెలల బాబు ఉన్నారు. అయితే, గత కొంత కాలంగా విక్రం ఎదురు ఫ్లాట్స్‌లో ఉండే షెఫాలి భాసిన్‌తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగేవి. 

ఘటన జరిగిన రోజు సాయంత్రం విక్రం దీపికా మరోమారు గొడవపడ్డారు. ‘నీ వ్యవహారాలు నచ్చడం లేదు. నన్నూ​.. నా పిల్లల్ని అన్యాయం చేయొద్దు. ఇప్పుడే వెళ్లి భాసిన్‌ అంతు చూస్తా’ అని దీపిక హెచ్చరించింది. దీంతో తన అక్రమ సంబంధం ‘చెడిపోతుంది’ అని భావించిన విక్రం తన భార్యను హతమార్చాలని పథకం రచించాడు. మంచిగా నటించి ఆ రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో దీపికతో బాల్కనీలో కాసేపు ముచ్చటించాడు. ఆమెను నమ్మించి ఒక్కసారిగా 8 అంతస్తుల ఎత్తు నుంచి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలపాలైన దీపిక ఆస్పత్రికి తరలించేలోపే మరణించిందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ హత్యలో విక్రమ్‌కి సహకరించాడనే అనుమానంతో మరోవ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు డీఎల్‌ఎఫ్‌ ఫేజ్‌-1 పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ సంజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top