గురుగావ్‌లో దారుణం.. తల్లిదండ్రులపై కత్తితో దాడి

Gurugram Man Feeling Unloved by Parents and Stabs Them - Sakshi

చండీగఢ్‌‌: తల్లిదండ్రులు తనకు సరైన ప్రధాన్యం ఇవ్వడం లేదనే కారణంతో వారిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు గుర్‌గావ్‌కు చెందిన ఓ వ్యక్తి. ఈ ఘనటనలో తండ్రి అక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన తల్లిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వివరాలు.. మృతుడు సుశీల్‌ మెహతా దంపతులకు రిషబ్ మెహతా, మయాంక్‌ మెహతా ఇద్దరు సంతానం. అయితే చిన్నతనం నుంచి తల్లిదండ్రులు తనకన్నా తమ్ముడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని రిషబ్ భావించేవాడు. దాని గురించి నిత్యం తల్లిదండ్రులతో గొడవపడేవాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం కూడా రిషబ్‌, తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. ఆ కోపంలో కత్తితో వారిపై దాడి చేశాడు రిషబ్. ఈ గొడవలో సుశీల్‌ మెహతా అక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలపాలైన రిషబ్ తల్లిని ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేర్చారు. రిషబ్‌ తల్లిదండ్రులతో గొడవపడే సమయంలో మయాంక్‌ ఇంట్లో లేడు. పండ్లు తీసుకురావడం కోసం మార్కెట్‌కు వెళ్లాడు. పక్కింటి వ్యక్తి ఈ గొడవ గురించి మయాంక్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించాడు.

అతడు ఇంటికి వచ్చే సరికి రిషబ్‌.. తన తండ్రిపై దాడి చేస్తూ కనిపించాడు. అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో మయాంక్‌కు కూడా గాయాలయ్యాయి. ఈ లోపు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరడంతో రిషబ్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం మయాంక్‌ తన తల్లిదండ్రులను ఆస్పత్రికి తీసుకెళ్లగా సుశీల్‌ మెహతా అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన తల్లిని ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించాడు మయాంక్‌. కేసు నమోదు చేసిన పోలీసులు రిషబ్ కోసం గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top