అట్టుడుకుతున్న పాకిస్తాన్‌ | Girl Raped, strangled and throwed into dump in Pakistan | Sakshi
Sakshi News home page

అట్టుడుకుతున్న పాకిస్తాన్‌

Jan 14 2018 5:58 PM | Updated on Oct 17 2018 5:51 PM

Girl Raped, strangled and throwed into dump in Pakistan - Sakshi

చెత్తకుప్పలో దొరికిన జైనాబ్‌ మృతదేహం (ఫైల్‌ ఫొటో)

కసూర్‌ (పాకిస్తాన్‌) : ఏడేళ్ల బాలికపై పైశాచికత్వంగా దాడి చేసి, హత్య చేసి, చెత్త బుట్టలో పడేసిన సంఘటనతో పాకిస్తాన్‌లో ప్రజాగ్రహం పెల్లుబికింది. చిన్నారులను కూడా కాపాడలేని ఈ పోలీసు వ్యవస్థ ఎందుకంటూ ప్రశ్నిస్తూ ప్రజలు రోడ్లపైకెక్కారు. పంజాబ్‌ ప్రావిన్సులోని కసూర్‌ పట్టణంలో ఈ దారుణం చోటు చేసుకుంది. జైనాబ్‌(7) తల్లిదండ్రులు ఉమ్రా యాత్రకు సౌదీ అరేబియా వెళ్లారు. దీంతో జైనాబ్‌ను వాళ్ల ఆంటీ వద్ద వదిలేశారు.

గత మంగళవారం ఖురాన్‌ చదువుకునేందుకు బయటకు వెళ్లిన జైనాబ్‌ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన జైనాబ్‌ ఆంటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఐదు రోజుల తర్వాత బాలిక ఇంటికి ఒక మైలు దూరంలో ఉన్న చెత్తకుప్పలో జైనాబ్‌ మృతదేహాన్ని గుర్తించారు.

జైనాబ్‌పై నాలుగు రోజుల పాటు పలుమార్లు అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన పాకిస్తాన్‌ ప్రజలను షాక్‌కు గురి చేసింది. అన్నెంపున్నెం ఎరుగని పసిగుడ్డులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న రాక్షసుడిని అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

కసూర్‌ పట్టణంలో బాలికలపై అత్యాచారాలు గత రెండేళ్లుగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకూ తొమ్మిది మంది బాలికలు కామాంధుడి క్రూరత్వానికి తనువు చాలించారు. ఈ దాడులన్నింటికి పాల్పడిన వ్యక్తి ఒకరే అని పోలీసులు వెల్లడించడం కాగా, జైనాబ్‌ మృతికి నిరసనగా పాకిస్తాన్‌ జాతీయ చానెల్‌కు చెందిన న్యూస్‌ రీడర్‌ ఒకరు కూతురితో లైవ్‌లో వార్తలు చదివిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement