అమ్మా..తింటానికి కొనుక్కుని వస్తా.. | Girl Died With Short Circuit In PSR Nellore | Sakshi
Sakshi News home page

అమ్మా..తింటానికి కొనుక్కుని వస్తా..

Jul 2 2018 1:25 PM | Updated on Jul 2 2018 1:25 PM

Girl Died With Short Circuit In PSR Nellore - Sakshi

బాలిక మృతదేహంవద్ద విలపిస్తున్న తల్లి

కోవూరు: ‘అమ్మా.. తింటానికి కొనుక్కుని వస్తా..’ అంటూ వెళ్లిన ఆ చిన్నారి అంతలోనే కానలోకాలకు వెళ్లిపోయింది. ఆదివారం స్కూల్‌ లేకపోవడంతో ఇంట్లోనే ఉన్న ఆ చిన్నారి అప్పటి వరకు సందడి చేసింది. తినుబండారాలు కొనుక్కోనేందుకు అంగడికి వెళ్లి తిరిగి వస్తుండగా విద్యుత్‌ తీగలు తగిలి మృతి చెందింది. ఈ విషాద ఘటన మండలంలోని చుండుగుంట ప్రాంతంలో ఆదివారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. చుండుగుంట ప్రాంతానికి చెందిన నలు బోతు శివ, వెంకమ్మ దంపతుల కుమార్తె అఖిలప్రియ (11) ఇనమడుగు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. ఆదివా రం సెలవు కావడంతో ఆ చిన్నారి ఇంటి వద్దనే ఉంది. చిరుతిండి కొనుక్కుంటానని ఇంట్లో మా రం చేసి తల్లినడిగి డబ్బులు తీసుకుని దుకాణానికి వెళ్లింది.

తిరిగి వస్తున్న క్రమంలో ఒక కుక్క బాలికను తరముకోవడంతో పరుగెత్తుతూ ఓ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు చేరుకుంది. అక్కడ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు గమనించి అఖిలప్రియ తల్లిదండ్రులకు చెప్పడంతో హుటాహుటినా  అఖిలప్రియను నెల్లూరులోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తీసుకెళ్లారు. అప్పటికే అఖిలప్రియ మృతి చెందిందననట్లు వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఏఈ కార్యాలయం ఎదుట నిరసన
విద్యుదాఘాతానికి గురై బాలిక మృతి చెందిన విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అట్లూరి సుబ్రహ్మణ్యం, ఎం.చిరంజీవితో పాటు స్థానికులు కోవూరు ఏఈ కార్యాలయానికి చేరుకుని విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను వేరే ప్రాంతాలకు మార్చాలని ట్రాన్స్‌కో అధికారులకు పలుమార్లు విన్నవించామన్నారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలాంటా ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement