కుమారుడిని లండన్‌ పంపించి వస్తూ... 

Four Dead In Road Accident At Jangaon District - Sakshi

రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం

లారీని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఢీకొట్టిన డీసీఎం

దేవరుప్పుల వద్ద ఘటన.. మానుకోటలో విషాదం

దేవరుప్పుల : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం సమీపాన జనగామ–సూర్యాపేట రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును డీసీఎం ఢీకొట్టిన ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మహబూబాబాద్‌ జిల్లా కొత్తబజార్‌కు చెందిన పెనుగొండ సదాశివుడు కుమారుడు సాయిశంకర్‌ ఎంబీఏ చదివేందుకు లండన్‌ వెళ్తున్నాడు. సదాశివుడు, ఆయన భార్య మంజూష, ఆయన తమ్ము డు, మరదలు గణేశ్‌ (52), సుకన్య (42), ఇంకో తమ్ముడైన పూర్ణచందర్‌ భార్య శ్రీలత (35)లతో పాటు సాయిశంకర్, మిగతా తమ్ముళ్ల పిల్లలు హైదరాబాద్‌ వెళ్లారు. గురువారం తెల్లవారుజామున శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో సాయిశంకర్‌ను విమానం ఎక్కించారు. ఆ తర్వాత కొందరు హైదరాబాద్‌లోనే ఆగిపోయారు. 

కొందరు వరంగల్‌.. ఇంకొకరు మానుకోట 
శంషాబాద్‌లో సాయిశంకర్‌ను విమానం ఎక్కించాక సదాశివుడు తన తమ్ముడు గణేశ్‌ కూతురు గాయత్రి, మరో తమ్ముడు పూర్ణచందర్‌ కూతురు ప్రవీణను వరంగల్‌ కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో దింపేందుకు కారులో బయలుదేరారు. సదాశివు డు భార్య మంజూష, గణేష్, ఆయన భార్య సుకన్య, పూర్ణచందర్‌ భార్య శ్రీలత ఇంకో కారులో దేవరుప్పుల మండల కేంద్రం మీదుగా మహబూబాబాద్‌ బయలుదేరారు. సూర్యాపేట వైపు నుంచి వస్తున్న డీసీఎం (ఏపీ 05 టీఎల్‌ 1369) డ్రైవర్‌ అతివేగంగా లారీని ఓవర్‌టేక్‌ చేసి వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టాడు. దీంతో గణేష్, సుకన్య, కారు డ్రైవర్‌ నజీర్‌ అక్కడికక్కడే మృతి చెందగా శ్రీలత, మంజూష గాయపడ్డారు. క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శ్రీలత మృత్యువాతపడ్డారు. మంజూషను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమా దం అనంతరం డీసీఎం డ్రైవర్‌ లొంగిపోయినట్లు సమాచారం. ఈ వార్త తెలియడంతో సాయిశంకర్‌ అబుదాబినుంచి స్వస్థలానికి బయలుదేరాడు. సాయిశంకర్‌ స్వగ్రామానికి చేరుకున్నాక అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top