అగ్గిపెట్టె లేకుండా బార్‌కు వస్తావా?

Drunken Gang Arrest in Conflicts in Bar Hyderabad - Sakshi

మందుబాబుల వీరంగం

ఓ వ్యక్తిని బెదిరించి సెల్‌ఫోన్,  నగదు చోరీ

ఐదుగురి అరెస్టు  

సాక్షి, సిటీబ్యూరో: మద్యం మత్తులో అగ్గిపెట్టె కోసం ఓ వ్యక్తితో గొడవ పెట్టుకుని వీరంగం సృష్టించడమే కాకుండా అతడిని బెదిరించి సెల్‌ఫోన్, నగదు లాక్కెళ్లిన కేసులో ఐదుగురు నిందితులను మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి బైక్, ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరిపై గతంలో కేసులు ఉండగా మరో ఇద్దరు విద్యార్థులు. డీసీపీ రాధాకిషన్‌రావు శుక్రవారం వివరాలు వెల్లడించారు. మోండా మార్కెట్‌కు చెందిన పగడాల మధు, సికింద్రాబాద్‌కు చెందిన పంజ కుమార్, ఎం.కృష్ణ, డి.ప్రభు మైఖేల్, మహ్మద్‌ జాఫర్‌ స్నేహితులు. వీరు మంగళవారం మధ్యాహ్నం మద్యం తాగేందుకు కవాడిగూడలోని ఓ బార్‌కు వెళ్లారు. అదే సమయంలో  శ్రీనివాస్‌ అనే వ్యక్తి కూడా అదే బార్‌లో మద్యం తాగుతున్నాడు. మద్యం మత్తులో ఉన్న పంజ కుమార్‌ అగ్గిపెట్టె ఇవ్వాలని శ్రీనివాస్‌ను కోరాడు. అయితే తన వద్ద లేదని చెప్పగా ‘అగ్గిపెట్టె లేకుండా బార్‌కు ఎందుకు వచ్చావ్‌?’ అంటూ అతడితో గొడవకు దిగాడు.

పోలీసుల అదుపులో నిందితులు
కుమార్‌కు మిగిలిన నలుగురూ అతడికి వత్తాసు పలికారు. అనంతరం ఐదుగురూ కలిసి శ్రీనివాస్‌ నుంచి సెల్‌ఫోన్‌ లాక్కున్నాడు. అది తిరిగి ఇవ్వాలంటే రూ.500 చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బాధితుడు డబ్బులు ఇవ్వగా దాంతో మద్యం కొనుక్కుని తాగిన వీరు సెల్‌ఫోన్‌ తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తూ వెళ్ళిపోయారు. దీనిపై బాధితుడు గాంధీనగర్‌ పోలీసులను  ఆశ్రయించడంతో కేసు నమోదైంది. ఆ రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన నిందితులను గుర్తించి పట్టుకునేందుకు సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎంఏ జావేద్‌ నేతృత్వంలో ఎస్సైలు టి.శ్రీధర్, కె.శ్రీనివాసులు, మహ్మద్‌ షానవాజ్‌ షఫీలతో కూడిన బృందం రంగంలోకి దిగింది. సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌తో పాటు ఇతర ఆధారాలను బట్టి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను గాంధీనగర్‌ పోలీసులకు అప్పగించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top