లగ్నపత్రిక రాయించేందుకు వెళ్తూ..

Daughter Marriage Father Deceased in Bike Accident Kurnool - Sakshi

రోడ్డు ప్రమాదంలో తండ్రి దుర్మరణం

అటికెలగుండు బ్రిడ్జి సమీపంలో ఘటన

పత్తికొండ రూరల్‌: కుమార్తె పెళ్లికి లగ్నపత్రిక రాయించేందుకు బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని మృత్యువు వెంటాడింది. లారీ రూపంలో ఎదురొచ్చి కాటువేసింది.  పత్తికొండ మండలం అటికెలగుండు బ్రిడ్జి సమీపంలో సోమవారం  ఈ ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే..ఆదోని మండలం బసాపురం గ్రామానికి చెందిన వీరేశప్ప (50)తన రెండో కుమార్తెకు దేవనకొండ మండల వాసితో వివాహం నిశ్చయించారు. పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామంలో అర్చకుడిని కలిసి  లగ్నపత్రిక రాయించాలని బంధువు   మహాలింగను వెంటబెట్టుకుని  బైక్‌లో బయలుదేరాడు.

మార్గమధ్యంలో అటికెలగుండు బ్రిడ్జి సమీపంలోని మలుపు వద్ద బోర్‌వెల్స్‌ లారీ ఎదురొచ్చి బైక్‌ను ఢీకొంది.ఈ ఘటనలో వీరేశప్ప అక్కడికక్కడే మృతిచెందగా మహాలింగకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో వారు అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంపై  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గుర్రప్ప తెలిపారు. కాగా మృతుడు వీరేశప్పకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. అతని   మరణ విషయం తెలియగానే వారంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top