లైంగిక దాడి ఆపై సజీవ దహనం

 Dalit Girl Gangraped Burnt To Death In Muzaffarnagar - Sakshi

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. చికిత్స నిమిత్తం తల్లితండ్రులు ఆస్పత్రిలో ఉండగా, 14 ఏళ్ల దళిత మైనర్‌ బాలికపై దుండగలు లైంగిక దాడికి పాల్పడి అనంతరం సజీవ దహనం చేసిన ఉదంతం వెలుగుచూసింది. ఈ కేసులో ఏడుగురిపై కేసు నమోదు చేసినా ఇప్పటివరకూ పోలీసులు ఏ ఒక్కరినీ అరెస్ట్‌ చేయలేదు. ముజఫర్‌పూర్‌లో బాలిక పనిచేసే ఇటుక బట్టీ వద్ద ఓ చిన్న గదిలో బాధితురాలి దగ్ధమైన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

ఇటుక బట్టీలో పనిచేస్తూ పొట్టపోసుకునే బాలిక కుటుంబం పక్కనే ఉన్న గదిలో నివసిస్తుండేదని స్ధానికులు చెప్పారు. గత వారం బాలిక తల్లితండ్రులు అస్వస్ధతతో ఆస్పత్రిలో చేరగా తమ్ముడితో కలిసి బాధితురాలు గదిలో ఉంటోంది. బాలికపై కన్నేసిన ఇటుక బట్టీ యజమాని మరో ఆరుగురుతో కలిసి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి సజీవ దహనం చేశారు.

కాగా, నిందితులపై హత్య, లైంగిక దాడి, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద పలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని బీమ్‌ ఆర్మీ హెచ్చరించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top