బంతి బంతికి బెట్టింగ్‌

Cricket Bettings in Medak - Sakshi

జోరుగా సాగుతున్న ఐపీఎల్‌ పందేలు

యువకులు, విద్యార్థులే పందేలకు ముందుకు

నిత్యం చేతులు మారుతున్న వేల రూపాయలు

పెడదోవ పడుతున్న యువత

టేక్మాల్‌(మెదక్‌): ఐపీఎల్‌.. బెట్టింగ్‌కు పర్యాయపదంగా మారింది. టోర్నీ పై యువతలో ఉన్న వివపరీతమైన క్రేజ్‌ను బెట్టింగ్‌ రాయుళ్లు క్యాష్‌ చేసుకుకుంటున్నారు. ప్రతీ మ్యాచ్‌లో టాస్‌ను మొదలుకొని బంతి బంతికి పందేలు కాస్తున్నారు. వ్యవహారమంతా ఆన్‌లైన్‌లలో, సెల్‌ఫోన్‌ల ద్వారా సాగుస్తున్నారు. మ్యాచ్‌ మొదలవ్వడానికి రెండు మూడు గంటల ముందే వాట్సప్, మెసేజ్, ఫోన్‌ కాల్స్, ఇంటర్నెట్‌లలో యువత బెట్టింగ్‌ను హోరెత్తిస్తుంది. ప్రస్తుతం ఐపిఎల్‌ నాకౌట్‌ దశకు చేరుకోవడంతో జూదం తారాస్థాయికి చేరింది. సాయంత్రం అయితే చాలు యువకులంతా గుమిగూడి ఫోన్‌లలో బీజిబీజిగా గడుపుతున్నారు.

బెట్టింగ్‌ సాగుతుందిలా..
బెట్టింగ్‌ నిర్వహిస్తున్న వారు ఆ రోజు నిర్వహించే ఐపిఎల్‌ మ్యాచ్‌కు సంబంధించిన సమాచారాన్ని యువతకు ముందుగానే చేరవేస్తారు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు నిర్దేశిత ప్రాంతానికి చేరకున్న యువత ముందుగా పోటీలో ఉన్న జట్ల బలబలాలను బేరీజు వేసుకొని బెట్టింగ్‌కు దిగుతున్నారు. టాస్‌ ఎవరు గెలుస్తారు, టాస్‌ గెలిస్తే ముందుగా బ్యాటింగా? బౌలింగా? పవర్‌ ప్లే ఆరు ఓటర్లలో ఎంత స్కోరు చేస్తారు? 20ఓటర్లలో ఎంత స్కోరు చేస్తారు? ఎవరు ఎన్ని వికెట్లు తీస్తారు? అనే అంశాలపై బెట్టింగ్‌ సాగిస్తున్నారు. వీటితో పాట ఆయా జట్లలోని ప్రధాన బ్యాట్స్‌మెన్ల వ్యక్తిగత స్కోరు ఎంత చేస్తారనే దానిపై కూడా బెట్టింగ్‌లు సాగుతున్నాయి.

చోరీలకు పాల్పడుతున్న యువత..
బెట్టింగ్‌ పేరుతో పెద్ద సంఖ్యలో యువకులు సొమ్ములు పోగొట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు పాకెట్‌ మనీకోసం ఇచ్చిన సొమ్మును బెట్టింగ్‌లో పోగొట్టుకుంటున్నారు. తిరిగి డబ్బుల కోసం సొంత ఇళ్లతో పాటూ వేరే ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు కూడా తెలుస్తోంది. బెట్టింగ్‌లో డబ్బులు పొగొట్టుకుంటున్న యువత ఏమి తోచని పరిస్థితిలో అఘాయిత్యాలకు పాల్పడే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఈ బెట్టింగ్‌ వ్యవహరంపై పోలీసులు దృష్టి సారించి బెట్టింగ్‌ ఆగడాలను అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

బెట్టింగ్‌ వ్యసనానికి దూరంగా ఉండాలి
ఐపిఎల్‌ బెట్టింగ్‌ వ్యసనానికి యువకులు, విద్యార్థులు దూరంగా ఉండాలి. డబ్బులను వృథా చేసుకోకూడదు. ఇంట్లో  అవసరాలకు ఇచ్చిన డబ్బులను బెట్టింగ్‌లలో పెట్టరాదు. బెట్టింగ్‌లు పెట్టి అప్పుల పాలుకావొద్దు. ఇటువంటి బెట్టింగ్‌లు చట్టరీత్యా నేరం. బెట్టింగ్‌లు పెట్టినట్లు మాకు తెలిసినా, సమాచారం అందినా, అనుమానితులైన వారిని విచారిస్తాం. బెట్టింగ్‌ రాయుళ్లపై కేసులు పెడతాం.–విజయరావ్, ఎస్‌ఐ, టేక్మాల్‌.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top