ప్రియురాలితో పాటు విషం సేవించిన దంపతులు

Couple And Lover Commits Suicide in Tamil Nadu - Sakshi

టీ.నగర్‌: చెన్నై ట్రిప్లికేన్‌ లాడ్జిలో ప్రియురాలితోపాటు విషం సేవించిన దంపతుల్లో భర్త మృతి చెందగా, బిడ్డతో పాటు ప్రియురాలు, భార్య చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన ఆదివారం కన్యాకుమారిలో చోటుచేసుకుంది. కరుంగల్‌ సమీపంలోని మాంగరైకు చెందిన జయన్‌ (30) భార్య పునితా రాణి (29). వీరి కుమార్తె జేసేబి (6). జయన్‌కు అదే ప్రాంతానికి చెందిన శరణ్య (21) అనే యువతితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. శరణ్యకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలియగానే జయన్‌ భార్య, బంధువులు ఆమెను మందలించారు. దీంతో జయన్, శరణ్య ఊరువిడిచి వెళ్లిపోయారు. పోలీసులు వారిని తీసుకొచ్చి కౌన్సెలింగ్‌ ఇచ్చి పాంపారు. తర్వాత కూడా జయన్, శరణ్య మధ్య బంధం కొనసాగింది.

వారు మరోసారి ఊరు విడిచి వెళ్లారు. దీంతో పోలీసులు మళ్లీ వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. శరణ్య వద్ద నుంచి తనను విడదీస్తే ఆత్మహత్య చేసుకుంటానని జయన్‌ పోలీసులను బెదిరించాడు. దీంతో పోలీసులు అతన్ని హెచ్చరించి రాతపూర్వకంగా లేఖ తీసుకుని పంపివేశారు. సొంత ఊరులో కలిసి జీవిస్తే అవమానం అని భావించిన జయన్‌ భార్య పునితా రాణి బిడ్డను తీసుకుని బయట ఊరికి వెళ్లేందుకు నిర్ణయించింది. ఆ సమయంలో ప్రియురాలు శరణ్యను కూడా తమతో తీసుకెళదామని జయన్‌ పట్టుబట్టాడు. మొదట్లో అతని భార్య వ్యతిరేకించింది. అయితే భర్త బెదిరింపులతో గత్యంతరం లేక సమ్మతం తెలిపింది. జయన్, భార్య పునితా రాణి, ప్రియురాలు శరణ్య, బిడ్డలు నలుగురు కొన్ని రోజుల క్రితం కరుంగల్‌ నుంచి చెన్నైకి చేరుకున్నారు. ట్రిప్లికేన్‌లోని ఓ లాడ్జిలో ఈ నెల 7న గది తీసుకున్నారు. ఆదివారం రాత్రి లాడ్జి ఉద్యోగులు వారుంటున్న గదికి వెళ్లి చూడగా లోపలివైపు గడియపెట్టి ఉంది. చాలా సేపు వారు తలుపుతట్టి చూడగా, తలుపులు తెరుచుకోలేదు. దీంతో తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూశారు. నలుగురు విషం సేవించి స్పృహతప్పి పడి ఉన్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని జయన్, పునితారాణి, శరణ్యని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పిల్లలను జేసీబీని ఎగ్మూర్‌లోని పిల్లల ఆస్పత్రిలో చేర్చారు.  చికిత్స పొందుతూ జయన్‌ సోమవారం ఉదయం మృతి చెందాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top