‘మామూళ్ల’ పోలీసులకు స్థానచలనం! | Corrupt Police List Released in Telangana | Sakshi
Sakshi News home page

‘మామూళ్ల’ పోలీసులకు స్థానచలనం!

Jun 8 2018 1:18 AM | Updated on Oct 22 2018 6:02 PM

Corrupt Police List Released in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీసు శాఖలో అవి నీతిని రూపుమాపే దిశగా అడుగులు పడు తున్నాయా? మామూళ్ల కోసం సామాన్య ప్రజ లను, వ్యాపారులను, ఇతర వర్గాలను వేధిస్తున్న క్షేత్రస్థాయి పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారా?.. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ నివేదిక ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ‘మామూళ్లు’వసూలు చేస్తున్న ఏఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టే బుళ్లు, హోంగార్డుల గురించి జిల్లా స్థాయిలో నివేదికలు తెప్పించుకున్న డీజీపీ.. వారిపై సమగ్ర విచారణ జరిపినట్లు ఈ నివేదిక పేర్కొంటోంది. స్పెషల్‌ పార్టీలు, ఐడీ పార్టీల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వారందరినీ ఆయా జిల్లాలు, కమిషనరేట్ల హెడ్‌క్వార్టర్లకు బదిలీ చేయాలని డీజీపీ ఆదేశించినట్టుగా ఉన్న అంశాలు పోలీసు శాఖలో సంచలనం సృష్టిస్తు న్నాయి. ఇది వాస్తవమైనదే అయి ఉండాలని.. ఈ చర్యలు అవినీతి రహిత ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు బాటలు వేసినట్టేననే ఆశాభావం వ్యక్తమవు తోంది. ఇంతకీ ఆ నివేదికలో ఏముందంటే..

391 మందిపై బదిలీ వేటు: రాష్ట్రవ్యాప్తంగా పైఅధికారులకు ‘ఫండ్‌ కలెక్టర్లు’గా పనిచేస్తున్న ఏఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు కలిపి 391 మందిని ఆయా హెడ్‌క్వార్టర్లకు బదిలీ చేయాలని డీజీపీ కార్యాలయం పేరిట ఉత్త ర్వులు వెలువడినట్టు ఆ నివేదికలో ఉంది. జయశంకర్‌ భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, జోగులాంబ గద్వాల జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల్లో మామూళ్ల వ్యవస్థ పనిచేస్తున్నట్టు పేర్కొ న్నారు. ఎస్సైల నుంచి డీఎస్పీ స్థాయి అధికారుల వరకు ఈ సిబ్బందిని ఫండ్‌ కలెక్టర్లుగా నియమిం చుకుని మామూళ్లు వసూలు చేస్తున్నట్టు పొందుపరిచారు. గత నెల 25న ఈ నివేదిక రాష్ట్ర పోలీస్‌ శాఖకు అందినట్టుగా చెబుతున్నారు.

సెటిల్‌మెంట్లు, ఇసుక దందాలు
ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్లు, డీఎస్పీ/ఏసీపీల కోసం ఈ ‘వసూల్‌ రాజాలు’ప్రతి నెలా మామూళ్లు వసూలు చేస్తున్నట్టు ఆయా పోలీస్‌స్టేషన్లు, సర్కిల్, సబ్‌డివిజన్ల పేర్లతో సహా నివేదికలో పొందుపరిచారు. ఇసుక దందాలు, భూ దందాలు, నిందితులతో కలసి సెటిల్‌మెంట్లు, మద్యం దుకాణాల నుంచి వసూళ్లు, గ్యాంబ్లింగ్‌ అడ్డాల నుంచి మామూళ్ల సేకరణ.. ఇలా పలు రకాలుగా ప్రతీ నెలా అధికారులకు వసూలు చేసిపెడుతున్నట్టు పేర్కొన్నారు. ఇలా ‘వసూల్‌ రాజా’లను ఏర్పాటుచేసుకున్న జాబితాలో సూర్యాపేట జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్‌ కమిషనరేట్, నిజామాబాద్‌ కమిషనరేట్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

అధికారికంగా ధ్రువీకరించని పోలీస్‌ శాఖ
మామూళ్ల వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా తీసుకున్నట్టుగా ఉన్న ఈ నిర్ణయంపై అధికారికంగా రాష్ట్ర పోలీసు కార్యాలయం ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. దీనికి సంబంధించి సోషల్‌ మీడియాతో పాటు పలు న్యూస్‌ చానళ్లలో ప్రసారమైన కథనాలపై స్పందించడానికి అధికారులు నిరాకరించారు. దీనిపై రాష్ట్ర పోలీసు శాఖ ముఖ్య కార్యాలయాన్ని సంప్రదించగా... ఆ జాబితా అనధికారికమని, దానిపై అధికారికంగా ఎలాంటి స్పందనా ఉండదని పేర్కొనడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement