రెండో భార్యే సూత్రధారి | congress Sarpanch murder case revealed | Sakshi
Sakshi News home page

రెండో భార్యే సూత్రధారి

Feb 17 2018 7:20 AM | Updated on Feb 17 2018 7:20 AM

congress Sarpanch murder case revealed  - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్‌,పూసలు(బాంబులు), కొవ్వొత్తి, అగ్గిపెట్టె తదితర వస్తువులు

నాగార్జునపేటతండాలో ఈనెల 12వ తేదీన అర్ధరాత్రి హత్యకు గురైన ఉపసర్పంచ్‌ ధర్మానాయక్‌ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో రెండో భార్యే ప్రియుడితో ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం సాగర్‌ పోలీస్టేషన్‌లో మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్‌ హత్య కేసు వివరాలను వెల్లడించారు.

నల్లగొండ, నాగార్జునసాగర్‌ : తిరుమలగిరి మండలం చింతలపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని నాగార్జునపేటతండాకు చెందిన దేపావత్‌ ధర్మానాయక్‌(45) చింతలపాలెం గ్రామ కాంగ్రెస్‌ ఉపసర్పంచ్‌. ఈయనకు ఇదే గ్రామపంచాయతీ పరిధిలోని జమ్మనకోటతండాకు చెందిన సావిత్రితో వివాహం జరిగింది. వివాహమై పదేళ్లయినా సంతానం కలగకపోవడంతో సావిత్రి చెల్లెలు శిరీషను రెండో పెళ్లి చేసుకున్నాడు.  వీరికి సోని(7), లక్ష్మీనర్సింహ(6), ప్రియాంక(3) ఉన్నారు. ఇద్దరి మధ్య వయస్సులో చాలాతేడా ఉండడంతో శిరీషా ధర్మానాయక్‌తో కాపురం చేయడానికి అంతగా ఇష్టపడకపోయేది. ధర్మానాయక్‌ బావమరిది హనుమంతు(సావిత్రి, శిరీషల సొంత తమ్ముడు), నాగార్జునపేటతండాకు చెందిన అంగోతు రవి(19)లు కలిసి నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలో గల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ చదువుకున్నారు. హనుమంతు «బావ ధర్మ ఇంట్లోనే ఉండి కళాశాలకు వెళ్లేవాడు.

ఈ క్రమంలో హనుమంతు చిన్నక్క శిరీషతో రవికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ధర్మకు ఈ విషయం తెలిసి శిరీషను కొట్టగా రవి, శిరీష ఇద్దరు చిన్న కూతురుతో కలిసి తండానుంచి వెళ్లిపోయారు. వారిని మందలించి డిసెంబర్‌ 15న తిరిగి తల్లిగారింటికి తీసుకువచ్చారు. అనంతరం నాగార్జునపేటకు సంసారానికి వచ్చింది. రవి హాలియాలోని గిరిజన బాలుర వసతిగృహంలో ఉంటూ ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోసం చదువుకుంటున్నాడు. సంసారానికి వెళ్లిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉండి, తమను ధర్మ మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని శిరీష రవికి ఫోన్‌ ద్వారా తెలియజేసింది. రవి చిన్నమ్మ కమిలీ ఇల్లు ధర్మ ఇంటిముందే ఉండడంతో వీరి వివాహేతర సంబంధానికి ఆమె సహకరిస్తూ వచ్చింది. వీరి సంబంధానికి అడ్డంగా ధర్మ ఉండడం.. తరచూ భర్త మందలిస్తుండడంతో ధర్మను చంపాలని, అనంతరం సుఖంగా ఉండవచ్చని రవికి తెలిపింది.

పదిరోజుల క్రితమే హత్యకు పథకం
పది రోజుల క్రితమే ధర్మను అడ్డు తొలిగించుకునేందుకు ఇరువురు కలిసి పథకం వేశారు. చేపలను చంపి పట్టే పూసలు(బాంబులు) తె మ్మని వాటిని పేల్చడం నాకు తెలుసు, అవి నాయకునితండాలో దొరుకుతాయని తీసుకురావాలని రవికి చెప్పింది. తనతో పాటు కళాశాలలో చదువుకున్న జూనియర్‌ విద్యార్థి కొర్రపాండును చేపలను చంపి పట్టే పూసల గురించి విచారించాడు. మేరావత్‌ హతీరాం ఇంట్లో దొరుకుతాయని చెప్పడంతో అక్కడకు వెళ్లి అడిగాడు. చేపలు చంపి పట్టేందుకు పూసలు కావాలని అడగడంతో తన భర్త హతీరాం లేడు రేపు రమ్మని చెప్పింది. త మది నాగార్జునపేట తండా అని, చెప్పడంతో ఇక్కడి తం డానే అని  చేపలు పట్టుకునేందు కుగా భావించి, రెండువందలు ఇస్తే రెండు పూసలు ఇచ్చింది. వాటి ని వేర్వేరు పేపర్లలో పొట్లం కట్టుకొని హాలియాకు వెళ్లి కంపచెట్లలో పెట్టి శిరీషకు ఫోన్‌చేశాడు. 11వ తేదీన ఆది వారం పైలాన్‌కు అంగడికి రమ్మని అక్కడికి తెచ్చి ఇస్తానని చెప్పాడు. తాను రావడం కుదరడంలేదని కమిలిని పంపిస్తున్నానని చెప్పింది. పైలాన్‌కు వచ్చిన  కమిలికి పూసలు (బాంబులు)న్న రెండు పొట్లాలు ఇచ్చాడు. వాటిని ఆరోజు రాత్రే కమిలి శిరీషకు ఇచ్చింది. 13వ తేదీ రాత్రి 2గంటల సమయంలో రవి శిరీషకు ఫోన్‌ చేసి మీఇంట్లో ఎవరెవరున్నారని అడిగాడు. అందరు శనగచేను కావలికి వెళ్లారని ధర్మానాయక్‌ ఇంటి ముందు గల రేకులకింద మంచంలో పడుకొని ఉన్నాడని చెప్పింది. రవి ఇదే మంచి సమయం మంచంపై బాంబులు పెట్టి చంపేయమని ధైర్యంచెప్పాడు.

ఉలిక్కిపడిన తండా
ధైర్యం తెచ్చుకున్న శిరీష తన వద్దగల పూసలు(బాంబులు) మంచంపై పెట్టి కొవ్వొత్తి ముట్టిం చుకొని తెచ్చి వాటికి అంటించి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. శిరీష పెట్టిన (పూసలు)బాంబులు పేలితండాలో పెద్ద శబ్దం వచ్చింది. తండాఅంతా ఉలి క్కి పడింది. శిరీష బయటకు వచ్చి చూడగా పొగ కమ్ముకొని ఉంది. ధర్మపడుకున్న మంచంపై నుంచి కొంత దూరంలో ఎగిరి బోర్లాపడి ఛిద్రమై రక్తపు మడుగులో పడి చనిపోయి ఉన్నాడు. శిరీష తనకేమి తెలియనట్లుగా ఏడ్చుకుంటూ తండావాళ్లయిన దూపావత్‌ సామిని, దూపావత్‌ మంగ్తలకు ధర్మను ఎవరో బాంబుపెట్టి చంపారని తెలిపింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు ధర్మానాయక్‌ తల్లి దేపావత్‌ ద్వాళి తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టినట్లు తెలిపారు.

ముందుగా హాలియాలోని గిరిజన హాస్టల్‌లో రవిని, అనంతరం తల్లిగారిల్లయిన జమ్మనకోటలో శిరీషను, వివాహేతర సంబంధానికి సహకరించిన అంగోతు కమిలిని, నాయకునితండాకు చెందిన హతీరాం గ్రామంలో లేకుండా మిర్యాలగూడ సమీపంలోని రాఘవాపురంలో ఆయన చెల్లెలు ఇంట్లో ఉండగా హతీరాంతో పాటు  ఆయన భార్య సుజాతలను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. హతీరాం దగ్గర 01 జిలిటిన్‌ స్టిక్‌తో పాటు 22 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిలిటిన్‌ స్టిక్స్‌తో పాటు ధర్మానాయక్‌ను హతమార్చేందుకు వినియోగించిన సెల్‌ఫోన్, కొవ్వొత్తి, అగ్గిపెట్టెతో సహా సేకరించి వారినందరినీ రిమాండ్‌కు పంపుతున్నట్లుగా డీఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. మేరావత్‌ హతీరాం పేలుడు పదార్థాలను గుంటూరు జిల్లా మాచర్లలో కొనుగోలు చేసినట్లు తెలపడంతో తదుపరి పూర్తి విచారణ జరిపి నేరస్తులందరిపై చార్జిషీట్‌ వేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో సాగర్‌ సీఐ రవీందర్, తిరుమలగిరి ఎస్‌ఐ కురుమయ్య, పెద్దవూర ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement