ప్లాస్టిక్ గుడ్ల కలకలం
రాజేంద్రనగర్: ప్లాస్టిక్ గుడ్లు విక్రయిస్తున్నారంటూ బుధవారం బండ్లగూడ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో అధికారులు విక్రయ దుకాణంలోని గుడ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. హైదర్షాకోట్ ప్రాంతంలోని జేవీఎస్ సూపర్ మార్కెట్లో బుధవారం ఉదయం స్థానిక ప్రాంతానికి చెందిన మహిళ కోడి గుడ్లను కోనుగోలు చేసి ఇంటికి వెళ్లింది. వాటిని మరగబెట్టి చూడగా అందులో నుంచి ప్లాస్టిక్ ద్రవ పదార్థం వచ్చింది. దీనిని సెల్ఫోన్ ద్వారా చిత్రీకరించి బండ్లగూడ జాగీరు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో మున్సిపల్ రెవెన్యూ అధికారి మనోహర్ సూపర్ మార్కెట్కు వెళ్లి గుడ్లను స్వాధీనం చేసుకున్నారు. విక్రయదారుడికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఇతరులకు వాటిని విక్రయించవద్దని సూచించారు. గుడ్లు ప్లాస్టిక్వా కాదా అనే విషయం వాటిని లేబరేటరీలో పరీక్షిస్తే తప్ప వాస్తవం వెల్లడి కాదని ఆయన తెలిపారు.
సంబంధిత వార్తలు