మూడేళ్లకే నూరేళ్లు!

Child Death While Eat Poison Tablets in Anantapur - Sakshi

పిప్పరమెంటనుకుని టిమెట్‌ తిన్నాడు

అస్వస్థతకు గురై కాసేపటికే కన్నుమూత

శోకసంద్రంలో తారకాపురం గ్రామం

నిండు నూరేళ్ల ఆయుష్షు..  మూడేళ్లకే ముగిసింది!చిన్న కుటుంబం..చింతల్లేని దాంపత్యం..రెక్కల కష్టమే వారి జీవనం  ఒక్కగానొక్క మూడేళ్ల ముద్దుల ‘తేజం’ఆ ఇంట అడుగులో అడుగేస్తూ.. బుడిబుడి నడకలేస్తూ..పడుతూ లేస్తూ...కళ్లముందు తిరుగుతుంటే..తప్పటడుగులు పడతాయేమోనని తల్లిదండ్రుల తాపత్రయంవడివడిగా తనయుడిని అనుసరిస్తూ ఊతమయ్యేవారు!‘అమ్మ’ చేతి వేలు పట్టుకొని..అడుగులో అడుగేస్తుంటే..  మా ముద్దుల చిన్ని కృష్ణయ్య అంటూ మురిసిపోయారు!ఎప్పటిలాగే తీపి బిళ్లలేమో అనుకొని  నోట్లో విషపుగుళికలు వేసుకున్నాడు..  అంతే...కొద్దిసేపటికి కళ్లు తేలేశాడు
దీపావళి పండుగ నాడు కొడుకుచేయి పట్టుకొనికాకర పువ్వులు వెలుగులు నిండాల్సిన ఆ ఇంట..చీకట్లు కమ్ముకుని..కన్నవారికి కడుపుకోత మిగిల్చింది..

అనంతపురం , ఉరవకొండ/ బొమ్మనహాల్‌ : పిప్పర్‌మింట్‌ బిల్ల అనుకుని టిమెట్‌ గుళికలను మింగిన చిన్నారి కొద్దిసేపటికే ప్రాణం కోల్పోయాడు. దీపావళి పండుగ వేళ ఆ ఇంట విషాదం నెలకొంది. బొమ్మనహాళ్‌ మండలం తారకాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. తారకాపురం  గ్రామానికి చెందిన చిరంజీవి, గీత దంపతులకు తేజ(3) ఒక్కగానొక్క కుమారుడు. చిరంజీవి దంపతులు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. మంగళవారం ఎప్పటిలాగే ఇంట్లో తమ కుమారుడిని అవ్వ వద్ద పెట్టి పనులకు పోయారు.

ఇంట్లో ఆడుకుంటున్న తేజ చేతికందే ఎత్తులో ఉంచిన టిమెట్‌ (విషపు) గుళికలు ఉండటం గమనించాడు. తాను రోజూ తినే పిప్పరమెంట్‌ అనుకుని చేతికి తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. కొద్ది సేపటికే అస్వస్థతకు గురయ్యాడు. అపస్మారకస్థితికి చేరుకున్న తేజను కొద్దిసేపటి తర్వాత అమ్మమ్మ గుర్తించి కేకలు పెట్టింది. ఇరుగుపొరుగు వారు వచ్చి వెంటనే తేజను ఉరవకొండ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ చిన్నారి కానరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.  ఈ ఘటనతో తారకాపురం శోకసంద్రంలో మునిగిపోయింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top