రెచ్చిపోయిన చందూలాల్‌ వర్గీయులు

Chandulal community Attacks on dissident leaders - Sakshi

అసమ్మతి నేతలపై దాడులు.. రెండు వాహనాలు ధ్వంసం  

8 మందిపై కేసు నమోదు  

ములుగు/వెంకటాపురం(ఎం): మంత్రి చందూలాల్‌ అనుచరులు రెచ్చిపోయారు. అసమ్మతి నేతలపై దాడి చేసి.. రెండు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ములుగు నియోజకవర్గ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. అసమ్మతి నేతలు పోరిక గోవింద్‌ నాయక్, తాటి కృష్ణ, టీఆర్‌ఎస్‌ జెడ్పీఫ్లోర్‌ లీడర్‌ సకినాల శోభన్, మేడారం మాజీ చైర్మన్‌ ఆలం రామ్మూర్తి తదితరులు మంగళవారం నిర్వహించ తలపెట్టిన ర్యాలీని జయప్రదం చేయాలని వెంకటాపురం మండలంలో ప్రచారం నిర్వహించారు.

ర్యాలీకి అనుమతి తీసుకోవడానికి గోవింద్‌నాయక్‌ తన వాహనం ఇచ్చి పలువురిని వెంకటాపురం పోలీస్‌స్టేషన్‌కు పంపించి మిగతా నేతలతో కలసి బూర్గుపేటకు వెళ్లారు. ఎల్లారెడ్డిపల్లె సమీపంలో మంత్రి వర్గీయులు వాహనాన్ని అడ్డగించి అద్దాలను పగులగొట్టారు. వాహనం టాప్‌ను చించివేయడంతోపాటు టైర్లలో గాలి తీసివేశారు. బూర్గుపేటలో అసమ్మతి నేతలు ప్రచారానికి వెళ్లిన విషయం తెలుసుకొని అక్కడికి చేరుకుని దాడికి యత్నించారు. ఈ క్రమంలో తాటి కృష్ణ వాహనాన్ని ధ్వంసం చేశారు.  కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top