రెండు చోట్ల చైన్‌ స్నాచింగ్‌

Chain Snatchings in Guntur - Sakshi

గుంటూరు ఈస్ట్‌: రెండు పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో కొద్ది నిమిషాల వ్యవధిలో ఇద్దరు మహిళల మెడలోని బంగారు గొలుసులు తెంచుకుని పోయిన ఘటన గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో కలకలం రేపింది. సేకరించిన సమాచారం మేరకు... లాలాపేట పరిధిలోని చలమయ్య కళాశాల రోడ్డులో మిట్టపల్లి రాజశేఖర్‌ భార్య రాణి  మంగళవారం రాత్రి  9.30 గంటల సమయంలో నడిచి వెళుతుంది. ఓ అగంతకుడు తలకు హెల్మెట్‌ పెట్టుకుని ద్విచక్రవాహనంపై వచ్చి రాణి మెడలోని ఎనిమిది సవర్ల బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు.

  చైన్‌కు ఉన్న రాకెట్‌ మాత్రమే కిందపడింది. 20 నిమిషాల తేడాతో అదేగంతకుడు పాతగుంటూరు పోలీసు స్టేషన్‌ పరిధిలోని బూరెల వారివీధిలో నడిచి వెళుతున్న పాదర్తి ఎస్‌.ఎన్‌.మూర్తి భార్య సుగుణ మెడలోని నాలుగు సవర్ల బంగారు గొలుసు తెంచుకుని పరారయ్యాడు. ఒకే వ్యక్తి రెండు చైన్‌స్నాచింగ్‌లు చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రెండు చైన్‌స్నాచింగ్‌లు జరగడంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్నారు. ఈస్ట్, వెస్ట్‌ పరిధిలోని అన్ని స్టేషన్‌ల సీఐలు, స్పెషల్‌ బ్రాంచ్‌ల పోలీసులు సంఘటనా స్థలాలకు వెళ్లి విచారణ మొదలు పెట్టారు. ఉన్నతాధికారులు పలు బృందాలను నిందితుడిని పట్టుకునేందుకు నియమించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top