దోపిడీకి పాల్పడిన ముఠా అరెస్ట్‌  

Burglary Gang Arrested - Sakshi

పరకాల : విలాసాలకు అలవాటుపడి దారిదోపిడీకి పాల్పడిన దొంగల ముఠాను పరకాల పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన ఐదుగురిలో ముగ్గురు మైనర్లు ఉండగా వారి నుంచి రూ.13 వేల నగదు, సెల్‌ఫోన్, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు పరకాల ఏసీపీ వైవీఎస్‌ సుధీంద్ర వెల్లడించారు. బుధవారం సాయంత్రం పరకాల పోలీస్‌ స్టేషన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిందితుల వివరాలు ఆయన వెల్లడించారు. హసన్‌పర్తి మండలం మడిపల్లె గ్రామానికి చెందిన అరికెల శ్రీవర్ధన్, కంఠాత్మకూర్‌ గ్రామానికి చెందిన కుమ్మరి శివాజీతోపాటు మరో ముగ్గురు మైనర్లు ముఠాగా ఏర్పడ్డారు.

రు జూలై 30న తెల్లవారుజామున 2 గంటలకు భూపాలపల్లి నుంచి ధర్మారం మీదుగా హన్మకొండ వైపు వెళ్తున్న ఇసుక లారీని ఆపి డ్రైవర్‌ గాజుల అనిల్‌పై దాడి చేసి రూ.15 వేల నగదు ఎత్తుకెళ్లి, పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేశారు. డ్రైవర్‌ ఫిర్యాదు అందగానే సీఐ శివరామయ్య ఆధ్వర్యంలో ఎస్సైలు శ్రీకాంత్‌రెడ్డి, రవీందర్, రవికిరణ్‌తో పోలీసు బృందాలు గాలించాయి. సీసీ కెమెరాల్లో లభ్యమైన ఆటో ఆధారంగా దోపిడీకి ముఠాను బుధవారం మధ్యాహ్నం నడికుడ శివారులో పట్టుకున్నట్లు తెలిపారు.

అరెస్టయిన వారిపై 395 సెక్షన్‌ కేసు నమోదు చేశారు. ఫిర్యాదు అందగానే రెండు రోజుల్లో నిందితులను  పట్టుకున్నందుకు సీఐ శివరామయ్య, ఎస్సైలను ఆయన అభినందించారు. ఈ కేసులో సీసీ కెమెరాల పుటేజీలు ఎంత దోహదపడ్డాయన్నారు. సమావేశంలో సీఐ శివరామయ్య, ఎస్సైలు శ్రీకాంత్‌రెడ్డి, రవీందర్, రవికిరణ్‌ పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top