చేతులు నరికి.. మెడపై కోసి | Brutally attacked on Married Women | Sakshi
Sakshi News home page

చేతులు నరికి.. మెడపై కోసి

Aug 26 2018 3:53 AM | Updated on Aug 26 2018 9:13 AM

Brutally attacked on Married Women - Sakshi

చికిత్స పొందుతున్న బాధితురాలు, పద్మ (ఫైల్‌)

హనుమాన్‌ జంక్షన్‌ రూరల్‌ (గన్నవరం): కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో ఓ వివాహితపై అత్యంత దారుణంగా హత్యాయత్నం జరిగింది. ఒంటిపై దుస్తులు తొలగించి.. కాళ్లు కట్టేసి, చేతులు నరికి, మెడపై కోసి పాశవికంగా హింసించారు. తీవ్ర గాయాలతో ఇంట్లో పడి ఉన్న ఆమెను భర్త గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. రాజమహేంద్రవరానికి చెందిన పల్లె పద్మ హనుమాన్‌ జంక్షన్‌ ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఓ బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త సూర్యనారాయణతో విభేదించి వేరుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఏలూరుకు చెందిన బత్తుల నూతన్‌కుమార్‌ విక్టర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ స్థానిక తారకరామ కాలనీ సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు.

రెండు రోజుల కిందట పద్మ, నూతన్‌కుమార్‌ల మధ్య గొడవ జరిగింది. ఈ తర్వాత పద్మ ఫోన్‌ స్విచాఫ్‌ రావటంతో అనుమానం వచ్చిన ఆమె కుమార్తె.. తండ్రి సూర్యనారాయణకు ఈ విషయం చెప్పింది. దీంతో శనివారం ఉదయం సూర్యనారాయణ ఆమె ఇంటికి వెళ్లాడు. బయట నుంచి పిలవగా ఎవరూ పలకపోవడం, తలుపులు తీసి ఉండటంతో ఇంటి లోపలికి వెళ్లిన సూర్యనారాయణ అక్కడి పరిస్థితి చూసి నిర్ఘాంతపోయాడు. కాళ్లు కట్టేసి, రెండు చేతులు తెగిపోయి, ఒంటిపై బట్టలు లేకుండా పద్మ పడి ఉండటాన్ని గుర్తించి.. వెంటనే హనుమాన్‌ జంక్షన్‌ పోలీసులకు సమాచారం అందజేశాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పద్మను 108లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఐ వై.వి.వి.ఎల్‌.నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనస్పర్థలు, గొడవల నేపథ్యంలో ప్రియుడు నూతన్‌కుమార్‌ ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement