ప్రియురాలిని కడతేర్చిన ప్రియుడు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తనకు దక్కని ప్రియురాలు మరెవ్వరికీ భార్య కాకూడదని కుట్రపన్నిన ఓ ప్రేమికుడు సైకోలా మారిపోయాడు. మరో యువకునితో పెళ్లి కుదుర్చుకున్న ప్రియురాలిని మాయమాటలతో లాడ్జీకి పిలిపించుకున్నాడు. విషం కలిపిన కూల్డ్రింక్ ఇచ్చి దుప్పట్టాతో గొంతుబిగించి కిరాతకంగా హతమార్చిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాలు.. చెన్నై సౌకార్పేటకు చెందిన సు మర్సింగ్ (23) అదే ప్రాంతానికి చెందిన కాజల్ (21) ఈనెల 10వ తేదీ రాత్రి చెన్నై చేపాక్లోని ఒక లాడ్జీలో దిగారు. మరుసటి రోజు గదిని శుభ్రం చేసేందుకు హోటల్ సిబ్బంది తలుపు తట్టినా తీయలేదు. ట్రిప్లికేన్ పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా సుమర్సింగ్, కాజల్ నోట్లో నుంచి నురగలు కక్కుతూ పడి ఉన్నారు. కాజల్ అప్పటికే మరణించి ఉండడంతో పోస్టుమార్టానికి పంపి, ప్రాణా పాయస్థితిలో ఉన్న సుమర్సింగ్ను ఆసుపత్రి లో చేర్పించారు. కాజల్ది ఆత్మహత్య కాదు, హత్య అని పోస్టుమార్టం రిపోర్టులో తేలడంతో ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న సుమర్సింగ్ను తమదైన శైలిలో విచారించగా హత్యచేసినట్లు అంగీకరించాడు.
నిందితుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. ప్రయివేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్న కాజల్ను కొన్ని నెలలపాటూ రోజూ వెంటబడిన సుమర్ సింగ్ ఎట్టకేలకూ ప్రేమలోకి దించాడు. రెండేళ్లుగా ఇద్దరం కలిసి తిరుగుతున్నాం. కాజల్ ధనిక కుటుంబానికి చెందిన యువతి కావడంతో ఎంతో డబ్బు ఖర్చుచేసేది. తరచూ లాడ్జీల్లో దిగుతూ జల్సా చేసేవాళ్లు. అయితే వారి ప్రేమ వ్యవహారం కాజల్ కుటుంబానికి తెలియడంతో పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. ఈ విషయాన్ని సుమర్సింగ్కు చెప్పి కలుసుకోవడం కొనసాగించేది. అప్పటికే వేలాది రూపాయలు ఖర్చుచేసిన కాజల్ను సుమర్ సింగ్ ఇంకా డబ్బు కావాలని ఒత్తిడిచేయడంతో విరక్తి చెందింది. తల్లిదండ్రులు కుదిర్చే యువకుడినే వివాహం చేసుకోవాలని తీర్మానించుకుంది. ప్రేమికునితో మాట్లాడడం మానేసింది. దీంతో రగిలిపోయిన సుమర్సింగ్ చివరిసారిగా మాట్లాడుకుందాం, డబ్బుల కోసం ఒత్తిడి చేయను అని గతనెల 10వ తేదీన లాడ్జీకి పిలిపించుకున్నాడు. కొద్దిసేపు మాట్లాడుకున్న తరువాత అప్పటికే సిద్ధం చేసుకున్న విషం కలిపిన కూల్డ్రింక్ను యువతిచేత తాగించాడు. గొంతులో మంటగా ఉంది..ఇందులో ఏమి కలిపావు అని కాజల్ కేకలు వేయడంతో ‘నన్ను ప్రేమించి వేరే యువకుడిని పెళ్లాడుతావా, నాకు దక్కని నీవు ఎవ్వరికీ దక్కడానికి లేదు’ అంటూ ఆమెధరించి ఉన్న దుప్పట్టాను మెడకు బిగించి ప్రాణాలు తీశాడు. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో విషం కలిపిన కూల్డ్రింక్ను అతడు కూడా తాగాడు. సుమర్సింగ్పై పెట్టిన ఆత్మహత్యాయత్నం కేసును హత్యకేసుగా మార్చి గురువారం అరెస్ట్ చేశారు.
సంబంధిత వార్తలు