వలస కుటుంబంలో తీరని విషాదం | boy dead in bees attack | Sakshi
Sakshi News home page

వలస కుటుంబంలో తీరని విషాదం

Feb 1 2018 10:53 AM | Updated on Jul 10 2019 8:00 PM

boy dead in bees attack - Sakshi

మృతి చెందిన ఆనంద్‌

పెద్దకడబూరు: ఉపాధి కోసం వలసెళ్లిన ఆ దంపతులు కన్న కొడుకును పోగొట్టుకున్నారు. తేనెటీగలు దాడి చేయడంతో వారి నాలుగేళ్ల కుమారుడు మృత్యువాత పడ్డాడు. దీంతో వారు పుట్టెడు దుఃఖంతో స్వగ్రామానికి తిరిగొచ్చారు. వివరాలిలా ఉన్నాయి. చిన్నకడబూరు గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి వ్యవసాయ కూలీ. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో నాలుగు రోజుల క్రితం భార్య ఈరమ్మ, నాలుగేళ్ల కుమారుడు ఆనంద్‌ను తీసుకుని మహారాష్ట్రకు వలస వెళ్లాడు. మంగళవారం అక్కడ ఓ పొలంలో ఆనంద్‌ను చెట్టు కింద వదలి భార్యాభర్త పనుల్లో నిమగ్నమయ్యారు.

ఆనంద్‌తో పాటు అక్కడ ఒక పాప ఉండగా.. ఇద్దరూ ఆడుకుంటున్నారు. ఇంతలోనే తేనెటీగలు వచ్చి దాడి చేశాయి. పాప పారిపోగా.. చిన్నారి ఆనంద్‌ శరీరం మొత్తం తేనెటీగలు కుట్టేశాయి. తల్లిదండ్రులు అక్కడికి చేరుకొనేలోపే నోటినుంచి నురుగు వచ్చి అక్కడికక్కడే చనిపోయాడు. చిన్నారి మృతదేహన్ని తీసుకొని తల్లిదండ్రులు బుధవారం స్వగ్రామం వచ్చి.. ఖననం చేశారు. కాగా.. వీరు వారం రోజుల క్రితం గ్రామ దేవరను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకున్నారు. దేవర ముగిసిన తర్వాత ఊళ్లో ఉపాధి లేకపోవడంతో మహారాష్ట్రకు వలసెళ్లారు. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement