న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఇటీవల ప్రారంభమైన సిగ్నేచర్ బ్రిడ్జిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. కేటీఎమ్ స్పోర్ట్స్ బైక్పై వేగంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు.. అదుపు తప్పి బ్రిడ్జిపై గల డివైడర్ను ఢీ కొట్టారు. దీంతో వారు 30 అడుగుల లోతులో పడిపోయారు. తీవ్రంగా గాయపడినవారిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కొల్పోయారు. కాగా, అధిక స్పీడ్తో వెళ్తూ.. సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించడంతోనే బైక్ అదుపుతప్పి ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, సిగ్నేచర్ బ్రిడ్జిపై జరిగిన తొలి యాక్సిడెంట్ ఇదే.
ఢిల్లీ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూసిన సిగ్నేచర్ బ్రిడ్జిని నవంబర్ 4 తేదీన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. బ్రిడ్జి ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడ సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవడానికి జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. బ్రిడ్జిపై వాహనాలు నిలిపి మరి ఫొటోలు దిగుతూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. కొందరైతే ప్రమాదకరంగా రేలింగ్పై నిల్చుని సైతం సెల్ఫీలు దిగుతున్నారు. పోలీసులు, అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. యువత వాటిని పట్టించుకోవడం లేదు.