
హత్యకు గురైన అపర్ణ, విజయలక్ష్మి, చిన్నారి.. అపర్ణ భర్త మధు(సర్కిల్లో)
సైబరాబాద్ పరిధిలోని చందానగర్లో ఓ కుటుంబం హత్య కలకలం రేగింది.
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలోని శేరలింగపల్లిలో ఓ కుటుంబం హత్య గురికావడం కలకలం రేగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన అపర్ణ అనే మహిళకు కూకట్పల్లికి చెందిన మధు అనే వ్యక్తితో ప్రేమ వివాహం జరిగింది. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. ప్రముఖ ఎలక్ర్టానిక్ కంపెనీలో అపర్ణ సేల్స్ ఉమెన్గా పనిచేస్తుండగా.. ఆమెతో పాటు తల్లి విజయలక్ష్మి కూడా ఉంటోంది. రెండు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడం.. ఇంటి నుంచి వాసన రావాడాన్ని సోమవారం ఉదయం గమనించిన వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళాలు పగులగొట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బలమైన గాయాలతో.. రక్తపు మడుగులో అపర్ణ కిచెన్లో.. ఆమె తల్లి, కుమార్తె ఒక గదిలో హత్యకు గురయ్యారు. అయితే మధు ఇది వరకే జరిగిన పెళ్లిని దాచిపెట్టి తనను రెండో పెళ్లి చేసుకున్నాడని ఇటీవల అపర్ణకు, భర్త మధుకు మధ్య గొడవలు జరిగాయని తెలుస్తోంది. దీంతో ఇరువురు చందానగర్ పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మధు.. అపర్ణను, కుమార్తెను సరిగా చూసుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అదే విధంగా మధు మొదటి భార్య కుటుంబం, అపర్ణను బెదిరించినట్టు కూడా చెబుతున్నారు. తన భర్తను మోసం చేసి రెండో పెళ్లి చేసుకుందని అపర్ణపై, మొదటి భార్య కుటుంబ సభ్యులు ద్వేషం పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ కారణాలతో అపర్ణ, ఆమె తల్లి, కుమార్తె హత్యకు గురయ్యారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు అపర్ణ భర్త మధు ఇవాళ మధ్యాహ్నం చందానగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.