బతుకుదెరువు కోసమొచ్చి కాటికి.. | 3 Bihar Youth Killed in Road Accident | Sakshi
Sakshi News home page

బతుకుదెరువు కోసమొచ్చి కాటికి..

Feb 27 2018 1:56 AM | Updated on Sep 4 2018 5:07 PM

3 Bihar Youth Killed in Road Accident - Sakshi

హైదరాబాద్‌ : పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చిన కార్మికులను మృత్యురూపంలో వచ్చిన గుర్తు తెలియని వాహనం బలితీసుకుంది. ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్‌ ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

బిహార్‌ సమస్తిపూర్‌లోని నామాపూర్‌ఖేడ్‌కు చెందిన హిరోలికుమార్‌ అలియాస్‌ రోహిత్‌ (18), గయాలోని నవడా ప్రాంతానికి చెందిన లక్ష్మణ్‌ (25), ఇదే ప్రాంతానికి చెందిన నితీశ్‌(27)... లక్ష్మీనారాయణ కాలనీలోని బజరంగ్‌ అట్టల ప్యాకేజీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఉప్పల్‌లోనే నివాసం ఉంటున్నారు. ఆదివారం గౌలిగూడలో నివాసముండే బం ధువుల దగ్గరికి బైక్‌పై వెళ్లి తిరిగి వస్తున్నారు. రాత్రి 12 గంటల సమయంలో రామంతాపూర్‌ నుంచి మోడ్రన్‌ బేకరీ వైపు తిరుగుతుండగా ఉప్పల్‌ నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొంది.

దీంతో వాహనంతోపాటు ముగ్గురూ ఎగిరిపడ్డారు. తీవ్ర గాయాలపాలైన వీరిని ఎవ రూ చూడకపోవడంతో సంఘటన స్థలంలోనే మృతిచెందా రు. అటుగా వెళ్తున్న యువకునికి ఫోన్‌ రింగ్‌ వినపడటంతో ఫోన్‌ ఎత్తి మాట్లాడాడు. భర్త ఇంకా ఇంటికి రాలేదంటూ నితీశ్‌ భార్య దివ్య మాట్లాడింది. కొద్ది దూరంలోనే గాయపడ్డ వారిని చూసిన యువకుడు విషయాన్ని దివ్యకు సమాచారం ఇచ్చాడు.

అనంతరం సంఘటన స్థలానికి పోలీసులు, బంధువులు చేరుకున్నారు. అప్పటికే ముగ్గురు మృతి చెందడంతో మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు. లక్ష్మణ్‌కు భార్య ప్రియాంక ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement