
సౌమ్యజిత్ ఘోష్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు (ఫైల్ ఫొటో)
సాక్షి, బరాసత్ : పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు అర్జున అవార్డు గ్రహీత సౌమ్యజిత్ ఘోష్ చిక్కుల్లో పడ్డాడు. తనపై ఘోష్ లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఓ పద్దెనిమేదేళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 'గత మూడేళ్లుగా ఘోష్ నేను రిలేషన్లో ఉన్నాము. ఆ సమయంలో అతడు నాపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. కానీ, ఆ తర్వాత నిరాకరించాడు' అంటూ బాధితురాలు పోలీసులకు తెలిపింది.
అదనపు సమాచారం మేరకు ఘోష్ సదరు యువతిని సోషల్ మీడియా ద్వారా 2014లో కలుసుకున్నాడు. అప్పటి నుంచి ఆమెతో సంబంధాలు కొనసాగించాడు. తరుచుగా కోల్కతాలోని ఘోష్ ప్లాట్లో, సిలిగురిలోని ఫ్లాట్లో వారిద్దరు కలుసుకునేవారు. ఓసారి ఆమె గర్భవతి కూడా అయిందని, బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడని సమాచారం. అంతేకాదు, వీరిద్దరు అనధికారికంగా ఓ ఆలయంలో వివాహం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ పెళ్లిని అతడు అంగీకరించడం లేదంట. బరాసత్ మహిళా పోలీస్ స్టేషన్లో ఈ మేరకు బాధితురాలు కేసు పెట్టింది. 24 ఏళ్ల ఘోష్ 2012, 2016 ఒలింపిక్స్లో భారత్ తరుపున పాల్గొన్నాడు.