ఎల్‌జీ పాలిమర్స్‌ సీఈవోకు రిమాండ్‌ | 14 days remand for LG Polymers CEO and employees | Sakshi
Sakshi News home page

ఎల్‌జీ పాలిమర్స్‌ సీఈవో, ఉద్యోగులకు రిమాండ్‌

Jul 9 2020 4:22 AM | Updated on Jul 9 2020 10:07 AM

14 days remand for LG Polymers CEO and employees  - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఎల్‌జీ పాలిమర్స్‌లో స్టైరీన్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనకు సంబంధించి ఆ సంస్థ సీఈవో, డైరెక్టర్‌తో పాటు అరెస్ట్‌ చేసిన 12 మందిని పోలీసులు బుధవారం మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చారు.  కోవిడ్‌–19 కారణంగా న్యాయమూర్తి జూమ్‌ యాప్‌ ద్వారా విచారణ నిర్వహించి.. నిందితులకు 14 రోజులపాటు రిమాండ్‌ విధించారు. అంతకుముందు నిందితులందరికీ కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. మే నెల 7న చోటుచేసుకున్న దుర్ఘటనలో కంపెనీ యాజమాన్యం, ఉద్యోగుల నిర్లక్ష్యం ఉన్నట్టు హైపవర్‌ కమిటీ నిపుణుల బృందం స్పష్టం చేసింది.

ఆ బృందం నివేదిక ఆధారంగా పోలీసులు సీఈవో అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుంకీ జియోంగ్, టెక్నికల్‌ డైరెక్టర్‌ డీఎస్‌ కిమ్, అడిషినల్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) పిచ్చుక పూర్ణచంద్రమోహన్, ఎస్‌ఎంహెచ్‌ ఇన్‌చార్జి హెచ్‌వోడీ కోడి శ్రీనివాస్‌కిరణ్‌కుమార్, ప్రొడక్షన్‌ టీమ్‌ లీడర్‌ రాజు సత్యనారాయణ, ఇంజనీర్లు చంద్రశేఖర్, గౌరీ శంకర నాగేంద్ర రాము, ఆపరేటర్‌ రాజేష్, నైట్‌ డ్యూటీ ఆఫీసర్‌ బాలాజీ, జీపీపీఎస్‌ ఇన్‌చార్జి అచ్యుత్, ఇంజనీర్‌ కె.చక్రపాణి, నైట్‌ షిఫ్ట్‌  సేఫ్టీ ఆఫీసర్‌ వెంకట నరసింహ రమేష్‌ పట్నాయక్‌లను మంగళవారం రాత్రి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. వారిని బుధవారం మధ్యాహ్నం మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చగా..  12 మందికి ఈ నెల 22 వరకు రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు వారిని విశాఖలోని సెంట్రల్‌ జైలుకు తరలించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement