షావోమి కొత్త ఫోన్‌.. ‘రెడ్‌మి వై2’ | Xiaomi Redmi Y2, MIUI 10 expected today | Sakshi
Sakshi News home page

షావోమి కొత్త ఫోన్‌.. ‘రెడ్‌మి వై2’

Jun 8 2018 12:56 AM | Updated on Jun 8 2018 3:42 PM

Xiaomi Redmi Y2, MIUI 10 expected today - Sakshi

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా ‘రెడ్‌మి వై2’ పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇందులో 3 జీబీ ర్యామ్‌/ 32 జీబీ మెమరీ వేరియంట్‌ ధర రూ.9,999గా, 4 జీబీ ర్యామ్‌/ 64 జీబీ మెమరీ వేరియంట్‌ ధర రూ.12,999గా ఉంది. అమెజాన్‌ సహా తమ సొంత వెబ్‌ పోర్టల్‌ ఎంఐ.కామ్, అలాగే ఎంఐ హోమ్‌ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్లు జూన్‌ 12 నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. వై2 ఫోన్‌లో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ప్రధాన ఆకర్షణగా చెప్పొచ్చు. ‘మేం మా తొలి సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌ వై1ను గతేడాది నవంబర్‌లో మార్కెట్లోకి తెచ్చాం. కస్టమర్ల నుంచి ఈ మోడల్‌కు మంచి ఆదరణ లభించింది. దీనిలానే వై2 కూడా వినియోగదాలకు మరింత చేరువవుతుందని విశ్వాసిస్తున్నాం’ అని షావోమి వైస్‌ ప్రెసిడెంట్, షావోమి ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మను జైన్‌ తెలిపారు. ఈ సందర్భంగా కంపెనీ తన అప్‌డేటెడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఎంఐయూఐ 10 బీటా వెర్షన్‌ను ఈ నెల తరవాత భారత్‌లో అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది.

ఇక్కడి ఫోన్లలో ఇక్కడి సర్క్యూట్‌ బోర్డులే
మేడిన్‌ ఇండియా ఫోన్లలో ఈ ఏడాది మూడో త్రైమాసికానికల్లా స్థానికంగా తయారు చేసిన సర్క్యూట్‌ బోర్డులనే (పీసీబీ) వాడతామని షావోమి పేర్కొంది. కంపెనీ భారత్‌లో తయారీ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది. ‘మేం ఇప్పటికే ఇండియాలో పీసీబీల తయారీని ఆరంభించాం. ఈ ఏడాది మూడో త్రైమాసికం (జూలై–సెప్టెంబర్‌) నాటికి ఇక్కడ తయారయ్యే అన్ని పరికరాల్లోనూ స్థానికంగా తయారు చేసిన పీసీబీలను అమర్చాలనేది మా లక్ష్యం’ అని షావోమి వైస్‌ ప్రెసిడెంట్, షావోమి ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మను జైన్‌ ఈ సందర్భంగా తెలిపారు. షావోమి ఇటీవల ఫాక్స్‌కాన్‌ భాగస్వామ్యంతో శ్రీపెరుంబుదూర్‌లో కొత్త పీసీబీ (మొబైల్‌ ఫోన్‌ మదర్‌బోర్డ్‌) యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఫోన్‌ తయారీ వ్యయంలో పీసీబీ వాటానే ఎక్కువ. చాలా కంపెనీలు పీసీబీలను స్థానికంగానే తయారుచేయాలని భావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పలు స్మార్ట్‌ఫోన్‌ విడిభాగాలపై 10 శాతం దిగుమతి సుంకం విధించడం దీనికి కారణం. స్మార్ట్‌ఫోన్స్‌ తయారీ కోసం రెండు కేంద్రాలున్న షావోమి ఇటీవలే శ్రీసిటీ (ఆంధ్రప్రదేశ్‌), శ్రీపెరుంబుదూర్‌ (తమిళనాడు)లో మరో 3 కేంద్రాలు ఏర్పాటు చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement